RJD: లాలు ప్రసాద్ తనయుడి వివాహ వేడుకలో గందరగోళం.. ఆహార పదార్థాలను లూటీ చేసిన దుండగులు!

  • పెళ్లిలోకి చొరబడిన దుండగులు
  • దొరికింది దొరికినట్టు దోచుకెళ్లిన వైనం
  • వైభవంగా జరిగిన పెళ్లిలో గందరగోళం

ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ పెద్దకుమారుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ వివాహ కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది. వివాహానికి హాజరైన కొందరు ఆహార పదార్థాలు, టపాసులతోపాటు వీఐపీలు, మీడియా ప్రతినిధులకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన గిఫ్ట్ ఐటమ్స్‌ను లూటీ చేశారు. ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రికారాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్‌ మెడలో తేజ్‌ప్రతాప్ మూడు ముళ్లు వేశారు. వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలో ఆహార పదార్థాలతోపాటు ఇతర వస్తువుల లూటీతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. వేలాదిమంది హాజరైన ఈ వివాహానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

తేజ్‌ప్రతాప్-ఐశ్వర్య దండలు మార్చుకున్న వెంటనే ఆర్జేడీ కార్యకర్తలుగా చెబుతున్న కొందరు అట్టపెట్టెలను చింపేసి అందులోని వస్తువులను లూటీ చేయడం ప్రారంభించారు. దీంతో కాసేపటికే పెళ్లి జరిగిన ప్రాంతం చిందరవందరగా మారింది. టేబుళ్లు, కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. పేల్చిన టపాసుల చెత్తాచెదారంతో ఆ ప్రాంతం నిండిపోయింది.

వెంటనే రంగంలోకి దిగిన పార్టీ నేతలు కర్రలు పట్టుకుని దుండగులను వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. దుండగులు తమపై దాడిచేసి కెమెరాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారని మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. వారు తమ పాత్రలను కూడా వదల్లేదని, దోచుకెళ్లారని కేటరర్లు తెలిపారు. ఏడువేల మందికిపైగా హాజరైన ఈ పెళ్లిలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.

More Telugu News