Jagan: అమిత్ షాపై పథకం ప్రకారం రాళ్లదాడి చేయించింది చంద్రబాబే!: జగన్ ఆరోపణ

  • అది తన పనేనని చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకి లేదు
  • పైగా ఆ దాడిని ఖండిస్తున్నట్లు మాట్లాడుతున్నారు
  • చంద్రబాబు పాలనలో కష్టాల్లో రైతులు

తిరుపతిలోని అలిపిరి వద్ద బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్ పై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలిసే జరిగిందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా, వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి కూడా ఆ ఆరోపణే చేశారు. ఈ రోజు పాదయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా కైకలూరు గాంధీబొమ్మ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న వైఎస్ జగన్ మాట్లాడుతూ... తిరుపతికి వస్తే అమిత్ షాపై చంద్రబాబు రాళ్లదాడి చేయించారని, కానీ అది తన పనేనని చెప్పుకునే ధైర్యం మాత్రం ఆయనకు లేదని అన్నారు.

చంద్రబాబు అంతా పథకం ప్రకారమే చేశారని, పైగా ఆ దాడిని ఖండిస్తున్నట్లు మాట్లాడుతున్నారని జగన్ ఆరోపించారు. కాగా, నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఆక్వా రంగంలో దళారీ వ్యవస్థ వచ్చిందని, ప్రత్యేక హోదాపై ఎన్నో మాటలు మార్చారని జగన్‌ విమర్శించారు.                                   

More Telugu News