Guntur: సినిమా థియేటర్‌లో రెచ్చిపోయిన యువకులు.. కుర్చీలు విరగ్గొట్టి, తెరను చించేసి, వీరంగం!

  • గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఘటన
  • అడ్డుకోబోయిన సిబ్బందిపై కుర్చీలతో దాడి
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని ఓ థియేటర్‌లో యువకులు నానా హంగామా సృష్టించారు. పూటుగా మద్యం తాగి సినిమాకు వచ్చిన సదరు యువకులు కుర్చీలను విరగ్గొట్టి, లైట్లు పగలగొట్టి, తెరను చించేసి వీరవిహారం చేశారు. ప్రశ్నించిన సిబ్బందిపైనా దాడి చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. చెరుకుపల్లి మండలం బొలుసుపాలేనికి చెందిన షేక్ సంధాని, షేక్ ఇలియాస్, గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన వసీం అక్రమ్‌లు కలిసి గురువారం రాత్రి ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు గుంటూరు వచ్చారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రత్తిపాడులో ఉన్న బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడ అందరూ కలిసి ఫుల్లుగా మందుకొట్టి స్థానిక మారుతి థియేటర్‌లో సెకెండ్ షో చూసేందుకు వెళ్లారు.

టికెట్లు తీసుకుని వారు లోపలికి వెళ్లిన తర్వాత థియేటర్ నుంచి పెద్దపెద్ద శబ్దాలు వస్తుండడంతో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు టికెట్లు ఇచ్చే వ్యక్తి లోపలికి వెళ్లాడు. కుర్చీలు విరగ్గొట్టి ఉండడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో థియేటర్ నుంచి వెళ్లిపోయిన వారు కొంతసేపటి తర్వాత మళ్లీ వచ్చి రెచ్చిపోయారు. హాలులోని లైట్లు, కుర్చీలు విరగ్గొట్టి నానా రభస చేశారు. అక్కడితో ఆగక తెరను చించేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై కుర్చీలతో దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News