Hyderabad: హైదరాబాద్ లో దారుణం... స్నేహితురాలిని రిసార్ట్స్ కు తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు!

  • స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలని వేధించిన సాయిప్రసాద్
  • అంగీకరించకపోవడంతో అత్యాచారానికి యత్నం
  • ఆపై గొంతు కోసి హత్య - విచారిస్తున్న పోలీసులు

తన స్నేహితురాలిని ఓ రిసార్టుకు తీసుకెళ్లిన ఉన్మాది, అక్కడామెను హత్య చేయడం హైదరాబాద్ శివార్లలో కలకలం రేపింది. ఈ ఘటన ప్రగతి రిసార్ట్స్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న శిరీష, సాయిప్రసాద్ స్నేహితులు. గతంలో కొన్ని సార్లు తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. తనకు ఇప్పుడే వివాహం ఆలోచన లేదని, బాగా చదువుకోవాలని ఉందని ఆమె చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో శిరీషపై ఆగ్రహం పెంచుకున్న సాయి, ఓ పథకం ప్రకారం ఆమెను గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రగతి రిసార్ట్స్ కు తీసుకెళ్లాడు.

ఆపై లైంగిక దాడికి యత్నించగా, శిరీష తీవ్రంగా ప్రతిఘటించింది. దాదాపు మూడు గంటల పాటు ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించిన సాయిప్రసాద్ విఫలమయ్యాడు. ఆమె బయటకు వెళితే, జరిగిన విషయం చెప్పేస్తుందని భావించిన సాయి ప్రసాద్, ఆమె గొంతుకోసి హతమార్చాడు. ఆపై సాయి బయటకు వెళ్లిపోగా, ఆ తర్వాత రిసార్ట్స్ నిర్వాహకులు విగతజీవిగా పడివున్న శిరీషను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై గంటల వ్యవధిలోనే సాయిప్రసాద్ పోలీసులకు పట్టుబడగా, ప్రస్తుతం సాయిని విచారిస్తున్నామని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీసీ సజ్జన్నార్ వెల్లడించారు.

More Telugu News