Karnataka: కర్ణాటకలో ఎన్నికలు.. గుంటూరులో బెట్టింగ్.. చేతులు మారుతున్న లక్షలు!

  • గుంటూరులో జోరందుకున్న బెట్టింగులు
  • మినిమం రూ.20 లక్షలు.. మ్యాగ్జిమం రూ.50 లక్షలు
  • బీజేపీకి వ్యతిరేకంగానే ఎక్కువ శాతం పందేలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గురువారం సాయంత్రంతో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగియగానే ఏపీలోని గుంటూరులో వేడి మొదలైంది. బెట్టింగులు జోరందుకున్నాయి. సీటు, స్థానాలను బట్టి రూ.20 లక్షలతో మొదలుకుని రూ.50 లక్షల వరకు కాసేందుకు పందెంరాయుళ్లు ముందుకొస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బెట్టింగ్ కాస్తున్నవారే ఎక్కువమంది కనిపిస్తుండడం గమనార్హం.

బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఐదు స్థానాలు ఎక్కువ వస్తాయని ఒకరు రూ.20 లక్షలు పందెం కట్టినట్టు సమాచారం. అలాగే బీజేపీకి 115 స్థానాలకు మించి ఒక్క సీటు కూడా ఎక్కువ రాదని మరో వ్యక్తి రూ.50 లక్షలు పందెం కాయడం గుంటూరులో హాట్ టాపిక్ అయింది. అలాగే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పోటీ చేస్తున్న బీజేపీ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి శ్రీరాములుపైనా పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారు. గుంటూరు జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్న బళ్లారిపైనే ఎక్కువ శాతం పందేలు కాసినట్టు తెలుస్తోంది.   

More Telugu News