Jammu And Kashmir: స్వాతంత్ర్యం రాదు... భారత సైన్యాన్ని ఎదిరించే శక్తి మీకు లేదు: కశ్మీర్ యువతకు రావత్ హెచ్చరిక

  • ఉగ్రవాదులను నిలువరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధం
  • యువత పట్ల సంయమనం పాటిస్తున్నాం
  • ఉగ్రవాదుల్లో చేరి నాశనం కావద్దు
  • ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్

కశ్మీర్ యువత ఆజాద్ పేరిట ఆయుధాలు ధరించడం సరికాదని, రాళ్లు రువ్వి మనుషుల ప్రాణాలు తీస్తున్న వారికి స్వాతనత్ర్యం రాబోదని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించారు. ఓ దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, భారత సైన్యాన్ని ఎదిరించే శక్తి వారి వద్ద లేదని అన్నారు. ఆజాదీ అంటూ వీధుల్లోకి వచ్చే వారిని నిలువరించేందుకు సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, వారు కోరుకునే స్వాతంత్ర్యం లభించే పరిస్థితులు లేవని అన్నారు. ఓ దినపత్రిక ఇంటర్వ్యూ ఇచ్చిన రావత్, అమాయకులను చంపి, తామేదో సాధించామని భావించడం పొరపాటని హితవు పలికారు.

టెర్రరిస్టు గ్రూపులు కొత్తగా ఉగ్రవాదులను చేర్చుకునే పనిలో ఉన్నాయని, యువత ఆ మార్గాన్ని ఎంచుకోరాదని కోరారు. ఎంతమంది ఉగ్రవాదులను చంపామన్న లెక్కలను తామెన్నడూ పరిగణనలోకి తీసుకోలేదని, భవిష్యత్తులోనూ ఇదే జరుగుతుందని చెప్పారు. ఇదే సమయంలో ఎవరినీ చంపాలన్న ఉద్దేశం తమకు ఉండదని, ఆయుధాలతో ఎవరు కనిపించినా, ముందుగా లొంగిపోవాలనే హెచ్చరిస్తామని, ఎదుటివైపు నుంచి కాల్పులు వచ్చే వరకూ తాము ఆయుధాలను వాడబోమని వివరణ ఇచ్చారు. పాకిస్థాన్, సిరియాల్లో ఉన్న సైన్యం మాదిరిగా భారత సైన్యం లేదని, చాలా సంయమనంతో వ్యవహరిస్తుందని తెలిపారు.

సిరియా, పాకిస్థాన్ లలో ఇటువంటి పరిస్థితే ఉండగా, అక్కడి ప్రభుత్వాలు, సైన్యం ట్యాంకులు, యుద్ధ విమానాలను వాడుతోందని గుర్తు చేసిన రావత్, కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత దిశగా ఇంతవరకూ ఒక్కసారి కూడా యుద్ధ విమానాన్ని వాడలేదని అన్నారు. ఇక్కడి యువతలో కోపముందన్న సంగతి తనకు తెలుసునని, హింసా మార్గంలో వెళితే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందన్న సంగతిని మరువరాదని హితవు పలికారు.

More Telugu News