Hyderabad: ధర్మపురిలో అర్ధరాత్రి కాల్పులు.. హైదరాబాద్ మద్యం వ్యాపారి దారుణ హత్య

  • తనకు ప్రాణ భయం ఉన్నట్టు మధ్యాహ్నమే పోలీసులకు ఫిర్యాదు
  • రాత్రి హత్య చేసిన దుండగుడు
  • నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు

జగిత్యాల జిల్లా ధర్మపురిలో అర్ధరాత్రి దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన మద్యం వ్యాపారి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం, హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన సత్యనారాయణ గౌడ్ కొన్నేళ్లపాటు ముంబైలో కల్లు వ్యాపారం నిర్వహించాడు.  

ధర్మపురి మండలం కమలాపూర్‌కు చెందిన నేరెళ్ల రాజు ఇంట్లో ఎల్లమ్మ పట్నాలు (అమ్మవారి గుడి ఎదుట వేసే భారీ ముగ్గులు) ఉండడంతో బుధవారం సత్యనారాయణ వారింటికి వెళ్లాడు. రాత్రి పది గంటల సమయంలో మద్యం కోసం మరో ముగ్గురితో కలిసి కారులో ధర్మపురికి వెళ్లాడు. అక్కడి మద్యం షాపు మూసివేసి ఉండడంతో కారును వెనక్కి తిప్పుతుండగా కారుకు అడ్డంగా ఓ వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. దీంతో అతడిని అడ్డు తప్పుకోమంటూ సత్యనారాయణ గౌడ్ కిందికి దిగాడు. ఆగంతకుడు వెంటనే మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. సత్యనారాయణ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ముంబైలో కల్లు వ్యాపారం నిర్వహించినప్పుడు కొందరితో ఏర్పడిన విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, తనకు ప్రాణభయం ఉందని బుధవారం మధ్యాహ్నం సత్యనారాయణ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News