tollywood: కిడ్నీ తీసుకుని డబ్బు ఎగ్గొట్టాడు... సినీ నటుడు బాలాజీపై జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి ఫిర్యాదు

  • కిడ్నీ ఇస్తే రూ. 20 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు
  • ఇప్పటి వరకు రూ. 3 లక్షలే ఇచ్చాడు
  • తప్పుడు పత్రాలు సృష్టించి మోసం చేశాడు

సినీ నటుడు బాలాజీ తనను నమ్మించి, మోసం చేశాడంటూ సినీ జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను యూసుఫ్ గూడలో ఉంటున్నానని... తన భర్త చనిపోయిన తర్వాత కుటుంబ భారాన్ని తానే మోస్తున్నానని ఫిర్యాదులో తెలిపింది. తన కుమార్తె అనారోగ్యం కారణంగా తను అప్పులపాలైనప్పుడు... బాలీజీ తన వద్దకు వచ్చాడని... ఆయన భార్యకు కిడ్నీ ఇస్తే రూ. 20 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడని చెప్పింది. ఇప్పటి వరకు కేవలం రూ. 3 లక్షలు మాత్రమే చెల్లించాడని... ఆసుపత్రిలో తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని, డబ్బు మొత్తం ముట్టినట్టు తప్పుడు పత్రాలను సృష్టించాడని తెలిపింది. నటి శ్రీరెడ్డితో కలసి వచ్చిన ఆమె ఈమేరకు ఫిర్యాదు చేసింది.

ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ, న్యాయం చేయాలని కోరుతూ... జూబ్లీహిల్స్ పోలీసులు, మానవహక్కుల కమిషన్, మా అసోసియేషన్ లకు ఫిర్యాదు చేశామని చెప్పింది. లక్ష్మి సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని, తన ఇంటి పైపోర్షన్ ను రాసిస్తానని, సినిమా క్యారెక్టర్లను ఇప్పిస్తానని బాలాజీ మాయమాటలు చెప్పి, మోసం చేశాడని తెలిపింది. లక్ష్మికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని చెప్పింది.

More Telugu News