KCR: చంద్రబాబు కేసులపై నేడు మరోసారి చర్చించనున్న కేసీఆర్

  • ఓటుకు నోటు కేసులో అందిన ఫోరెన్సిక్ నివేదిక
  • మళ్లీ కదిలిన కీలక కేసు
  • నేడు మరోసారి చర్చించనున్న తెలంగాణ సీఎం

ఓటుకు నోటు కేసులో చండీగఢ్ ఫోరెన్సిక్ నివేదిక రావడంతో, మరోసారి కదిలిన కీలక కేసు విషయంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలు, ముందుకు సాగాల్సిన విధానంపై చర్చించేందుకు ఈ మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్, ఉన్నతాధికారులతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మేరకు కేసును విచారించిన ఏసీబీ, సీబీసీఐడీ అధికారులు ప్రగతి భవన్ కు రావాలని సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. నిన్న కూడా ఏసీబీ అధికారులు సీఎంను కలిసి చార్జ్ షీట్ దాఖలు చేసే విషయమై వివరాలు అందించిన సంగతి తెలిసిందే.

దాదాపు మూడున్నరేళ్ల క్రితం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వద్దకు అప్పటి తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి వెళ్లి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేస్తే రూ. 50 లక్షలు ఇస్తామని చెబుతూ అడ్వాన్స్ చెల్లిస్తుండగా, ఏసీబీ అధికారులు రైడ్ చేసిన ఘటన తీవ్ర సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఆపై స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడుతూ, తాను అన్నీ చూసుకుంటానని, తమ వాళ్లు అన్నీ చెప్పారని చేసిన వ్యాఖ్యల ఆడియో మరింత కలకలం రేపింది. ఈ కేసులో అరెస్టయిన రేవంత్ రెడ్డి కొన్ని రోజుల పాటు జైల్లోనూ గడపాల్సి వచ్చింది. ఆపై సంవత్సరాల తరువాత ఇప్పుడు మరోసారి కేసు తెరపైకి రావడం గమనార్హం.

More Telugu News