Vijayanagaram District: పెళ్లయిన పది రోజుల్లోనే భర్తను హత్య చేయించిన నవవధువు

  • గత నెల 28న వివాహం
  • సోమవారం నాడు బైక్ పై వెళుతుండగా దాడి
  • మిత్రుడు, రౌడీషీటర్ సాయంతో హత్య చేయించిన భార్య
  • గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు

కొత్తగా పెళ్లయన ఓ జంట సోమవారం రాత్రి వ్యాహ్యాళికి వెళ్లగా, ఇద్దరు దుండగులు దాడి చేసి యువకుడిని దారుణంగా హత్య చేశారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి సమీపంలో కలకలం సృష్టించిన ఈ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించగా, విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఆ యువకుడి భార్యే తన ప్రియుడి కోసం భర్తను హత్య చేయించిందని విచారణలో తేలింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, శ్రీకాకుళం జిల్లా చిట్టిపూడివలస గ్రామానికి చెందిన యామక గౌరీశంకరావుకు, విజయనగరం జిల్లా కడెకళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి గత నెల 28న పెద్దలు వివాహం జరిపించారు. వీరిద్దరూ బావా, మరదులే కావడం గమనార్హం. అయితే సరస్వతి అప్పటికే శివ అనే ఓ వ్యక్తిని ప్రేమించింది. మేనబావతో వివాహం ఇష్టం లేని సరస్వతి, ప్రియుడు శివ, విశాఖపట్నం రౌడీషీటర్ గోపీల సాయంతో భర్తను హత్య చేయించింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తనపైనా దాడి చేయించుకుంది. అదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విచారణలో భాగంగా పోలీసులు హైవేపై తనిఖీలు చేస్తుండగా శివ, గోపీలు ప్రయాణిస్తున్న ఆటో వేగంగా వెళుతూ, ఎస్పీ ప్రయాణిస్తున్న వాహనాన్ని టేకోవర్ చేసింది. దీంతో ఆ ఆటోను ఆపిన ఎస్పీ, వారిని ప్రశ్నించగా, పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన ఆయన, వారిని పోలీసులకు అప్పగించారు. సరస్వతిపై దాడి చేసిన వారు వీరేమోనన్న అనుమానంతో పోలీసులు విచారించగా, అసలు నిజం బయటకు వచ్చింది. కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News