Crude Oil: 2014 తరువాత తొలిసారి... 70 డాలర్లు దాటిన ముడి చమురు ధర

  • 1.4 శాతం పెరిగిన క్రూడ్ ఫ్యూచర్స్
  • ఇరాన్ పై అమెరికా తాజా ఆంక్షలే కారణం
  • జూన్ లో సౌదీ అరేబియా కీలక నిర్ణయాలు
  • 80 డాలర్లకు చేరనున్న క్రూడాయిల్ ధర!

క్రూడాయిల్ ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో ఒకటైన ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం ముడిచమురు ధరలపై పడింది. నవంబర్ 2014 తరువాత తొలిసారిగా బ్యారల్ ముడిచమురు ధర 70 డాలర్లను దాటింది. న్యూయార్క్, లండన్ లలో క్రూడ్ ఫ్యూచర్స్ ధర 1.4 శాతం పెరిగాయి. ఒపెక్ (చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య) దేశాల్లో మూడో అతి పెద్దదైన ఇరాన్ పై అమెరికా హెచ్చరికలు, ఆంక్షల నేపథ్యంలోనే క్రూడాయిల్ ధరలు పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

మరోవైపు ఉత్పత్తిని తగ్గిస్తూ వస్తున్న ఒపెక్ దేశాల ప్రభావం కూడా పడుతోందని, ఈ కారణంతోనే ఈ సంవత్సరం క్రూడాయిల్ ధరలు 12 శాతానికి పైగా పెరిగాయని తెలుస్తోంది. క్రూడాయిల్ ధర బ్యారల్ కు 60 నుంచి 65 డాలర్ల మధ్య ఉంటే అది సంతృప్తికరమని ట్రేడర్లు భావిస్తుండగా, సమీప భవిష్యత్తులోనే బ్యారల్ ధర 80 డాలర్లకు చేరినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. ఇక వచ్చే నెలలో వియన్నాలో జరిగే ఒపెక్ కీలక సమావేశంలో బ్యారల్ క్రూడాయిల్ ధరను 80 డాలర్లకు పెంచడమే లక్ష్యంగా సౌదీ అరేబియా కొన్ని నిర్ణయాలను ప్రకటించే అవకాశాలు ఉండటంతోనే ఫ్యూచర్స్ పై ఒత్తిడి అధికంగా ఉందని సమాచారం.

ఇక వెస్ట్ టెక్సాస్ లో జూన్ డెలివరీ క్రూడాయిల్ కాంట్రాక్టు ధర 97 సెంట్లు పెరిగి 70.69 డాలర్లకు చేరగా, న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ లో ఈ ధర 70.47 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో కాస్తంత నాణ్యతతో ఉండే బ్రెంట్ క్రూడాయిల్ ధర 91 సెంట్లు పెరిగి 75.78 డాలర్లకు చేరింది. ఈ ధరలు మరింతగా పెరుగుతాయన్న ఆందోళనను ఆయిల్ మార్కెట్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News