Budvwl: ఇద్దరమూ జంప్ జిలానీలమే... నీ అదృష్టం బాగుందంతే!: మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఎమ్మెల్యే జయరాములు నిప్పులు!

  • బద్వేలులో మంత్రి ఆదినారాయణరెడ్డి బైక్ ర్యాలీ
  • తనకు చెప్పకుండా ఎలా చేస్తారన్న ఎమ్మెల్యే జయరాములు
  • ఎస్సీ నియోజకవర్గంలో ఆధిపత్యం చూపుతున్నారని విమర్శలు

తనకు తెలియకుండా తన నియోజకవర్గ పరిధిలోని పోరుమామిళ్లలో మంత్రి ఆదినారాయణరెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించడంపై బద్వేలు ఎమ్మెల్యే జయరాములు మండిపడ్డారు. ఇదే సందర్భంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ విజయజ్యోతి తదితరులపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఇద్దరమూ జంప్ జిలానీలమేనని, వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చామని గుర్తు చేసిన ఆయన, అదృష్టం బాగుండి ఆదినారాయణరెడ్డి మంత్రి అయ్యారని, తాను కాలేదని వ్యాఖ్యానించారు. డబ్బు సంపాదనకే రాజకీయాల్లోకి ఆది వచ్చారని, తాను ప్రజా సేవ చేసేందుకు వచ్చానని అన్నారు. ఆయన నియోజకవర్గానికి చెప్పకుండా తాను వెళ్లి ర్యాలీలు నిర్వహిస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.

పార్టీ కార్యక్రమాలకు కూడా తనను పిలవడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను కలసి పోదామని భావిస్తున్నా ఇన్ చార్జ్ విజయమ్మ వినడం లేదని, బద్వేలులో అందరమూ కలసి ఒకేచోట దీక్ష చేద్దామంటే వినకుండా వేర్వేరు శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. దళితుడినని తనపై చిన్నచూపు చూస్తున్నారని, ఎస్సీలకు రిజర్వ్ అయిన నియోజకవర్గంలో అగ్రవర్ణాల పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నించారు. చేతనైతే ఇతర నియోజకవర్గాలకు వెళ్లి ఇలాగే ఆధిపత్యం చెలాయించాలని జయరాములు సవాల్ విసిరారు.

More Telugu News