dachepalli: రోజాను పార్ట్ టైమ్ ఎమ్మెల్యేగా పేర్కొన్న చినరాజప్ప

  • రాజకీయ రంగు పులుముకున్న దాచేపల్లి అత్యాచార ఘటన
  • ఇలాంటి విషయాలను కూడా రాజకీయం చేస్తారా? అంటూ చినరాజప్ప ఫైర్
  • నిందితుడి కోసం 15 బృందాలు గాలిస్తున్నాయంటూ వెల్లడి

గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనంటూ ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబును దద్దమ్మ ముఖ్యమంత్రి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో, రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ, రోజా ఒక పార్ట్ టైమ్ ఎమ్మెల్యే అంటూ విమర్శించారు. ఇలాంటి సున్నితమైన ఘటనలను కూడా రాజకీయం చేయాలనుకోవడం చాలా దారుణమని అన్నారు. నిందితుడి కోసం 15 పోలీసు బృందాలు గాలిస్తున్నాయని, అవసరమైతే మరిన్ని టీమ్ లను రంగంలోకి దించుతామని చెప్పారు.

నిందితుడికి సంబంధించిన ఆచూకీని ఎవరైనా చెబితే... బహుమానం అందిస్తామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించామని చెప్పారు. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం బాధాకరమని అన్నారు. ప్రస్తుతం దాచేపల్లిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. 

More Telugu News