narayanamurthy: రెండు కోడిపుంజుల్లా కొట్టుకుంటున్నారు.. కేంద్ర సర్కారు నవ్వుతోంది: 'హోదా'పై ఆర్‌.నారాయణమూర్తి

  • కొంతమంది 'హోదా' కోసం ఫైట్‌ చేస్తున్నారు
  • మరి కొంత మంది మరోలా ప్రవర్తిస్తున్నారు
  • కొట్టుకు చావండి అని కేంద్ర సర్కారు అనుకుంటోంది

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాల్సిందేనని సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... "ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ తిరుపతిలో వెంకన్న సాక్షిగా చెప్పారు. ప్రజలు ఓట్లేసి గెలిపించారు. కానీ, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. పాలకులకు ప్రజలంటే భయం, భక్తి ఉండాలి. అవి లేని నాడు వ్యతిరేకత వస్తుంది.

ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఈ సందర్భంగా నేను రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది ప్రత్యేక హోదా కోసం ఫైట్‌ చేస్తోంటే, మరికొంత మంది మరోలా ప్రవర్తిస్తున్నారు. ఇలాగే, రెండు కోడిపుంజుల్లా.. రెండు పొటేళ్లలా.. రెండు దున్నపోతుల్లా కొట్టుకుంటుంటే.. మీరూ మీరూ కొట్టుకుని చావండి, మేమెందుకు ఇస్తాం ప్రత్యేక హోదా? అని కేంద్ర ప్రభుత్వం హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటోంది.

మనకు సిగ్గుచేటు.. కాబట్టి ఓ ఆంధ్రప్రదేశ్‌ బిడ్డలారా.. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ముందుగా మీ జెండాలు పక్కన పెట్టండి. ప్రత్యేక హోదా సాధనే మీ అజెండాగా ఏకం కండి" అని అన్నారు.

More Telugu News