Jammu And Kashmir: పాఠశాల బస్సుపై రాళ్ల దాడి.. భయంతో వణికిపోయిన చిన్నారులు

  • జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఘటన
  • బస్సులో 35 మంది విద్యార్థులు
  • ఒకరికి తీవ్రగాయాలు

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఓ పాఠశాల బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడం కలకలం రేపింది. చిన్నారులపై పాల్పడిన ఈ ఘటన పట్ల సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన గురించి పోలీసులు వివరిస్తూ జవూరా ప్రాంతంలో రోడ్డుపై నుంచి వెళుతోన్న రెయిన్‌బో హై స్కూల్‌ పాఠశాల బస్సుపై ఆందోళనకారులు రాళ్లు విసరడంతో ఆ బస్సు అద్దాలు పగిలిపోయాయని, ఆ సమయంలో బస్సులో 35 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఈ ఘటనలో రెండవ తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

రాళ్లదాడిలో మరికొందరు చిన్నారులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో బస్సులోని చిన్నారులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మహబూబా ముప్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణ ఘటనకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

More Telugu News