BJP: అమ్మాయిలను అలా రోడ్ల మీద వదిలేస్తే రేప్‌లు జరగవా?: నోరు పారేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే

  • రేప్ ఘటనలకు తల్లిదండ్రులే కారణం
  • వారికి సెల్‌ఫోన్లు ఇచ్చి పాడుచేస్తున్నారు
  • దుమారం రేపిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు

మహిళల అత్యాచారాలపై ఉత్తరప్రదేశ్‌లోని బైరియా బీజేపీ ఎమ్మెల్యే సురేందర్ సింగ్ నోరు పారేసుకున్నారు. అమ్మాయిలను అలా రోడ్ల మీద వదిలేస్తే అత్యాచారాలు జరక్కుండా ఎలా ఉంటాయని ప్రశ్నించారు. దీనంతటికీ కారణం తల్లిదండ్రులేనని ఆడిపోసుకున్నారు. ఉన్నావో రేప్ కేసులో చిక్కుకున్న కుల్‌దీప్ సింగ్ సెంగార్‌ను వెనకేసుకొచ్చిన ఆయన ముగ్గురు పిల్లల తల్లిపై ఎవరైనా అత్యాచారం చేస్తారా? అని ఎదురు ప్రశ్నించారు. అయినా, దీనంతటికీ కారణం తల్లిదండ్రులేనని అన్నారు. పిల్లలను స్వేచ్ఛగా వదిలేయడం వల్లే ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించి దుమారం రేపారు.

15 ఏళ్ల లోపు పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని, వారికి స్వేచ్ఛ ఇవ్వకూడదని అన్నారు. అలాగే సెల్‌ఫోన్లు కూడా వారికి ఇవ్వొద్దని హితవు పలికారు. పిల్లలను తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలపై బీజేపీకి ఉన్న గౌరవానికి ఇది ప్రత్యక్ష నిదర్శమని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. రేపిస్టులకు బీజేపీ కొమ్ముకాస్తోందని విమర్శిస్తున్నాయి.

More Telugu News