Mahanati: అశ్విన్ కథ చెబుతుంటే కన్నీళ్లు ఆగలేదు.. 30 సార్లు ఏడ్చేశాను: సావిత్రి కుమారుడు

  • ఘనంగా ‘మహానటి’ ఆడియో ఫంక్షన్ 
  • హాజరైన సావిత్రి కుమారుడు, కుమార్తె
  • అమ్మే తమను ఇక్కడికి రప్పించిందని వ్యాఖ్య

అలనాటి దిగ్గజ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘మహానటి’ సినిమా ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు హాజరైన ఈ వేడుకకు సావిత్రి కుమారుడు సతీశ్, కుమార్తె విజయ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మానాన్నల సినిమా చూసేందుకు తామెంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. అమ్మే తమను ఇక్కడికి రప్పించిందన్నారు. అభిమానులు చూపిస్తున్న ఆప్యాయతే తమను ఇక్కడి వరకు రప్పించిందని, తాను ఎంతో అదృష్టవంతురాలినని విజయ అన్నారు.

అనంతరం సావిత్రి కుమారుడు సతీశ్ మాట్లాడుతూ సినిమా ప్రకటించగానే తొలుత భయపడ్డానని పేర్కొన్నారు. ట్రాజెడీ తీస్తున్నారేమోనని అనిపించిందన్నారు. నాగ్ అశ్విన్‌ను పిలిపించుకుని స్టోరీ వినాలనుకున్నానని తెలిపారు. అశ్విన్ ఫోన్‌లో స్టోరీ చెబుతుంటే కన్నీళ్లు ఆగలేదని పేర్కొన్నారు. ఏడవకూడదనుకుంటూనే 30 సార్లు ఏడ్చేశానని సతీశ్ వివరించారు. కాగా, ‘మహానటి’  సినిమాలో టైటిల్ రోల్‌ను కీర్తి సురేశ్ పోషించగా, సమంత జర్నలిస్ట్ పాత్రలో నటించింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

More Telugu News