Chandrababu: బాబు గారూ.. ఆ డబ్బులు పట్టిసీమలో సంపాదించినవేనా? : జీవీఎల్

  • చంద్రబాబు విలాస దీక్షలకు డబ్బులెక్కడివి?
  • అది పోరాటం కాదు.. పదవి కోసం ఆరాటం
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీ మట్టికరవడం ఖాయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు చేస్తున్న దీక్షలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. దీక్షకు చేస్తున్న ఖర్చుల లెక్కలు చెప్పాలని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడడం ద్వారా వచ్చిన డబ్బులతోనా? లేక పట్టిసీమలో సంపాదించిన డబ్బులతోనా? అని ప్రశ్నించారు. అసలు మీ పోరాటాలకు, ఆరాటాలకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు విలాసవంతమైన, ఖరీదైన దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.

చంద్రబాబుది  పోరాటమో, అధికారం కోసం ఆరాటమో అర్థం కావడం లేదని విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో టీడీపీ మట్టి కరవడం ఖాయమన్నారు. తిరుపతిలో నిర్వహించిన ధర్మపోరాటం పూర్తిగా అధర్మమైనదని అన్నారు. బాబు దీక్షను దైవం కూడా అడ్డుకుందని, వర్షం పడి బిగ్ స్క్రీన్లు తడిసిపోయాయని నరసింహారావు ఎద్దేవా చేశారు.

More Telugu News