TTD: బీజేపీ, టీడీపీ మళ్లీ కలవనున్నాయి... సాక్ష్యమిదే: రోజా

  • మహారాష్ట్ర మంత్రి భార్యకు టీటీడీ పదవి
  • బీజేపీతో తెగదెంపులు నాటకమే
  • స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు
  • నిప్పులు చెరిగిన రోజా

తెలుగుదేశం పార్టీ మరోమారు బీజేపీతో కలిసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకునేందుకే చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్టు నాటకం ఆడుతున్నారని అన్నారు. ఇదే సమయంలో మహారాష్ట్రకు చెందిన మంత్రి, బీజేపీ నేత భార్యకు టీటీడీ బోర్డులో పదవిని ఇచ్చారని గుర్తు చేసిన ఆమె, రెండు పార్టీల మధ్యా స్నేహబంధం ఉందని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యమేం కావాలని ప్రశ్నించారు.

స్వలాభం కోసం టీటీడీ బోర్డును కూడా ఆయన రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. గడచిన నాలుగేళ్లలో టీటీడీ బోర్డులో ఒక్క బీజేపీ నేతను కూడా నియమించని ఆయన, ఇప్పుడు ఆ పని చేసి తన స్నేహాన్ని చాటుకున్నారని రోజా ఎద్దేవా చేశారు. కుట్రకు పేటెంట్ రైట్ చంద్రబాబేనని, నాలుగేళ్ల పాటు కేంద్రంలో ఎన్నో పదవులు అనుభవించి, ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన ఆయన, ప్రజలే తనను రక్షించాలని వేడుకుంటున్నారని, చంద్రబాబుకు రాజకీయపు విలువలే లేవని, ఆయన్ను నమ్మకద్రోహి అనడం తప్పుకాదని వ్యాఖ్యానించారు.

More Telugu News