amaravathi: ఏపీ రాజధాని ప్రాంతంలో రూ.494 కోట్లతో వెయ్యి అపార్టుమెంట్లు ..వేలం పద్ధతిలో విక్రయిస్తాం: మంత్రి నారాయణ

  • ‘నో లాస్...నో ప్రాఫిట్’ విధానంలో చదరపు అడుగు రూ.3,500 
  • అపార్టుమెంట్ల నిర్మాణానికి ప్రభుత్వం పదెకరాలు కేటాయించింది
  • జి+11 పద్ధతిలో ఈ నిర్మాణాలను చేపడతాం
  • 71 మున్సిపాల్టీల్లో 203 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తాం

అమరావతిలో వివిధ సంస్థల్లో పని చేసే ప్రైవేటు ఉద్యోగులతో పాటు ఇతరుల కోసం రూ.494 కోట్ల వ్యయంతో వెయ్యి అపార్టుమెంట్లు నిర్మించనున్నామని, వాటిని వేలం ద్వారా వారికి విక్రయించనున్నట్టు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. ఈ అపార్టుమెంట్లను మూడు కేటగిరిలలో నిర్మించనున్నట్టు చెప్పారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న అపార్టుమెంట్ల నిర్మాణాల ప్రగతిపై  చంద్రబాబు సమీక్షించారని, నిర్దేశించిన లక్ష్యంలోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారని అన్నారు. రాజధాని భూ సేకరణలో భాగంగా ల్యాండ్ పూలింగ్ కింద మిగిలిన 1500 ఎకరాలపై చర్చ జరిగినట్లు తెలిపారు.

సిటీ కోర్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తున్నామని, కోర్టులు అమరావతికి వచ్చిన తరవాత దాంట్లో ఎందరో ఉద్యోగులు ఉంటారని, వారితో పాటు ప్రైవేటు ఉద్యోగులు కూడా ఉంటారని, ముఖ్యంగా లాయర్లకు ఈ అపార్టుమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. వాళ్లందరి కోసం రూ.494 కోట్లతో వెయ్యి అపార్టుమెంట్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు అనుమతులిచ్చారని, ఏడాదిలోగా ఈ నిర్మాణాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో త్వరలో టెండర్లు పిలవడానికి సీఆర్డీయే చర్యలు చేపట్టిందని అన్నారు.

జి+11 పద్ధతిలో చేపట్టే ఈ అపార్టుమెంట్ల నిర్మాణానికి ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించిందని, వేలం పద్ధతిలో అపార్టుమెంట్లు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ఫస్ట్ ఫేజ్ లో ఈ నిర్మాణాలు చేపడతామని, ప్రజల నుంచి వచ్చే స్పందన మేరకు మరిన్ని అపార్టుమెంట్ల నిర్మాణం చేపడతామని అన్నారు. 1200 చదరపు అడుగుల్లో 500 అపార్టుమెంట్లు, 1500 చదరపు అడుగుల్లో 300ల, 1800 చదరపు అడుగుల్లో 200.. ఇలా మూడు కేటగిరీల్లో రాజధాని పక్కన ఈ అపార్టుమెంట్లు నిర్మించనున్నట్లు చెప్పారు. ‘నో లాస్...నో ప్రాఫిట్’ విధానంలో ఈ అపార్టుమెంట్లను చదరపు అడుగు రూ.3,500 కు విక్రయించనున్నామని మంత్రి తెలిపారు.

మొదటి విడతగా 71 మున్సిపాల్టీల్లో 203 అన్న క్యాంటీన్లు

రాష్ట్రంలో మొదటి విడతగా 71 మున్సిపాల్టీల్లో 203 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు నారాయణ తెలిపారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ ఉంటుందన్నారు. లంచ్, డిన్నర్ ఖరీదు రూ.5  మాత్రమేనని అన్నారు. బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, పొంగల్, ఉప్మా ఉంటాయని, ఇడ్లీ రేటు రూపాయి అని తెలిపారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఇప్పటికే స్థలాలు గుర్తించామని, కొన్ని ప్రాంతాల్లో ఇతర శాఖలకు చెందిన భూములు కూడా ఉన్నట్టు చెప్పారు. ఆ భూములను అన్న క్యాంటీన్ల నిర్మాణానికి కేటాయిస్తూ ఈరోజే జీవో జారీ చేయనున్నట్లు తెలిపారు.

ఆనం వివేకానందరెడ్డి ప్రజల మనిషి 

మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి ఎంతో బాధాకరమని మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు. ఆయన మూడు పర్యాయాలు ఎమ్మెల్యే గా పని చేశారని, పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన ఆయన ప్రజల మనిషి అని కొనియాడారు. ఆనం వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తునున్నాని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

More Telugu News