Maoists: మావోల రక్తంతో ఎరుపెక్కిన ఇంద్రావతి నది.. 37కు పెరిగిన ఎన్‌కౌంటర్ మృతుల సంఖ్య!

  • తెలంగాణ-మహారాష్ట్ర-చత్తీస్‌గడ్ సరిహద్దులో రెండు భారీ ఎన్‌కౌంటర్లు
  • మృతుల్లో అత్యధికంగా 19 మంది మహిళలు
  • మృతుల్లో మావోయిస్టు అగ్రనేత?

తెలంగాణ-మహారాష్ట్ర-చత్తీస్‌గడ్ సరిహద్దులో ఆదివారం నుంచి జరిగిన రెండు భారీ ఎన్‌కౌంటర్లలో హతమైన నక్సలైట్ల సంఖ్య 37కు చేరుకుంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో మావోయిస్టు అగ్రనేత కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గడ్చిరోలి జిల్లా భామ్రాగఢ్‌ తహసీల్‌లో ఇంద్రావతి నదీ పరీవాహక ప్రాంతంలోని తాడ్‌గావ్‌ అటవీ ప్రాంతంలో నక్సల్స్ పెద్ద ఎత్తున సమావేశం అయినట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం వారిని చుట్టుముట్టారు.

దీనిని గమనించిన మావోలు కాల్పులు ప్రారంభించడంతో, పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. గంటన్నరపాటు జరిగిన ఈ కాల్పుల్లో 16 మంది మృతి చెందారు. వీరిలో 9 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన కొందరు తప్పించుకున్నారు. తప్పించుకున్న వారి గురించి గాలించేందుకు భారీ వర్షాలు అడ్డంకిగా మారడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు.

మంగళవారం ఇంద్రావతి నదిలో గాలిస్తున్న పోలీసులకు కుళ్లిన స్థితిలో ఉన్న మరికొన్ని మృతదేహాలు కనిపించాయి. తాజాగా దొరికిన మృతదేహాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 37కు చేరుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. కాగా, పోలీసులు స్వాధీనం చేసుకున్న మొత్తం మృతదేహాల్లో 19 మంది మహిళలవి కాగా, 18 మంది పురుషులవి. ఇప్పటి వరకు 16 మృతదేహాలను గుర్తించిన పోలీసులు అందులో నలుగురు దళ కమాండర్లు ఉన్నట్టు చెప్పారు. గుర్తించిన నక్సలైట్లపై రూ.1.06 కోట్ల నగదు బహుమతి ఉన్నట్టు మహారాష్ట్ర అడిషనల్‌ పోలీసు డీజీ కనకరత్నం తెలిపారు.

More Telugu News