BJP: ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు దృఢ సంకల్పంతో పని చేస్తున్నారు: బీజేపీ నేత సాయికుమార్

  • ఏపీకి కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుంది
  • ప్రధాని మోదీ తప్పక సహకరిస్తారు
  • కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై బీజేపీ నేత, ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ ప్రశంసలు కురిపించారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఆయన నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి ముందు కదిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా సాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబునాయుడు దృఢ సంకల్పంతో పని చేస్తున్నారని ప్రశంసించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందని, ప్రధాని మోదీ తప్పక సహకరిస్తారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మోదీని కోరతానని, అవసరమైతే ఆయన కాళ్లు పట్టుకుంటానని సాయికుమార్ భావోద్వేగం చెందారు.

బాగేపల్లి తన తల్లి స్వగ్రామమని, బెంగళూరుకు సమీపంలోనే ఈ గ్రామం ఉన్నప్పటికీ అభివృద్ధి చెందలేదని అన్నారు. బాగేపల్లి అభివృద్ధి చెందాలని తన తల్లి కోరుకునేదని, ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి తాను బరిలోకి దిగానని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పిన సాయికుమార్, రాబోయే ఐదేళ్లలో ప్రధానిగా మోదీనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News