google: సుందర్ పిచాయ్ కు గూగుల్ నుంచి షేర్ల ద్వారా భారీ మొత్తం!

  • 2014లో సుందర్ పిచాయ్ కు 3,53,939 షేర్ల కేటాయింపు
  • నేడు వాటి విలువ 380 మిలియన్ డాలర్లు
  • మన కరెన్సీలో వాటి విలువ సుమారు రూ.2,523 కోట్లు

2015 నుంచి గూగుల్ సంస్థ సీఈఓగా వ్యవహరిస్తున్నసుందర్ పిచాయ్ కు షేర్ల ద్వారా వేల కోట్ల రూపాయలు రానున్నట్టు బ్లూమ్ బర్గ్ వార్తా సంస్థ వెల్లడించింది. 380 మిలియన్ డాలర్లు.. అంటే, మన కరెన్సీలో సుమారు రూ.2,523 కోట్లు ఆయనకు దక్కనున్నాయి. ఎలా అంటే.. 2014లో సుందర్ పిచాయ్ పదోన్నతి పొందడానికి ముందు 3,53,939 షేర్లను సంస్థ ఆయనకు కేటాయించింది. 

సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతల స్వీకరణకు ముందు ఆయనకు కేటాయించిన షేర్ల విలువ బాగా పెరిగిపోయిందని, వాటి విలువ ఇప్పుడు రూ.2,523 కోట్లు అయిందని ‘బ్లూమ్ బర్గ్’ పేర్కొంది. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తాన్ని అందుకోనున్న ఒక పబ్లిక్ సంస్థ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ కావడం విశేషం.  

కాగా, ఎస్ అండ్ పీ 500 కంపెనీల సీఈఓలు 2016లో 16.2 మిలియన్ డాలర్లను షేర్ల ద్వారా సంపాదించారని సదరు సంస్థ పేర్కొంది. ఇదిలా ఉండగా, 2017 సంవత్సరానికి సుందర్ పిచాయ్ ఎంత వేతనంగా అందుకున్నారనే వివరాలను ‘గూగుల్’ వెల్లడించలేదు. ఈ విషయమై సంస్థ ప్రతినిధి మాట్లాడేందుకు అంగీకరించకపోవడం గమనార్హం.

More Telugu News