KTR: అక్షర యోధుడిని ఆదుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌

  • పక్షవాతంతో మంచానికి పరిమితం అయిన చైతన్య ప్రకాశ్
  • మూడు లక్షల అర్థిక సాయం 
  • 25 ఏళ్లుగా సాహితీ సేవలో ఉన్న కవి
  • రేకుల షెడ్డులో తల్లితో జీవనం సాగిస్తోన్న ప్రకాశ్

దయనీయ పరిస్థితుల్లో ఉన్న అభ్యుదయ కవి, కథా రచయిత చైతన్య ప్రకాశ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. సిరిసిల్ల రాజన్న జిల్లాలోని ముస్తాబాద్ మండలానికి చెందిన చైతన్య ప్రకాశ్‌ 25 సంవత్సరాలుగా అనేక కథలు, పుస్తకాలు రాశారు. సామాజిక చైతన్యం, వామపక్ష భావజాలంతో సాహిత్యాన్ని అందిస్తోన్న చైతన్య ప్రకాశ్ ప్రస్తుతం పక్షవాతంతో బాధపడుతూ తన తల్లి, సోదరి వద్ద కాలం వెళ్లదీస్తున్నారు.

తెలుగులో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన చైతన్య ప్రకాశ్ గతంలో మూడు పుస్తకాలు, వందలాది కవితలను రాశారు. మరుగున పడిపోతున్న తెలంగాణ పల్లె పదాలను, సామెతలను ఒక్కచోట చేర్చి ప్రకాశ్ రాసిన ఆరువేల తెలంగాణ సామెతలతో కూడిన పుస్తకాన్ని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం ఆవిష్కరించింది. గత ఫిబ్రవరిలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన చైతన్య ప్రకాశ్, కరీంనగర్ లోని అపోలో రీచ్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు.

అయనకు పక్షవాతం వచ్చిందని, దీర్ఘకాలంగా మందులు వాడాలని, అప్పుడే ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని డాక్టర్లు తెలిపారు. 25 సంవత్సరాలుగా సాహిత్య సేవను మాత్రమే నమ్ముకున్న సత్య ప్రకాశ్ సంపాదించుకున్నదేమీ లేదు. ప్రస్తుతం సిరిసిల్లలోని తన మిత్రుడు ఇచ్చిన రేకుల షెడ్డులోనే తల్లి, సోదరితో ప్రకాశ్‌ నివాసం ఉంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా, సొంతంగా కాలకృత్యాలు సైతం తీర్చుకోలేని దయనీయ స్థితిలో ఉన్న చైతన్య ప్రకాశ్‌ను ఆయన సాహితీ మిత్రులు పరామర్శించారు. ఆయన పరిస్థితి చివరకు మంత్రి కేటీఆర్‌ దృష్టికి వచ్చింది.

వెంటనే తన కార్యాలయ సిబ్బందికి ప్రకాశ్‌ను ఆదుకోవాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం చైతన్య ప్రకాశ్‌తో మాట్లాడి ఆయన చికిత్సకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. దీంతో పాటు తన కనీస అవసరాలు తీర్చుకునేందుకు 3 లక్షల రూపాయల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం వైపు నుంచి మంత్రి మంజూరు చేయించారు. ఈ రోజు ఆ ఆర్థిక సాయాన్ని చైతన్య ప్రకాశ్‌కు మంత్రి కార్యాలయం అందించింది. అచేతనంగా పడి ఉన్న తన కొడుకుకు ఆర్థిక సాయం అందించిన కేటీఆర్‌కి చైతన్య ప్రకాశ్‌ తల్లి ఎల్లమ్మ కృతజ్ఞతలు తెలిపింది.

More Telugu News