Chandrababu: చంద్రబాబు గారూ! మీరు చేసిన దీక్ష జపాన్ తరహా ఉద్యమంలా లేదే! : అంబటి రాంబాబు

  • జపాన్ తరహాలో పని చేస్తూ ఉద్యమాలు చెయ్యాలన్నారుగా
  • నిన్న మీరు చేసిన నిరాహార దీక్షా ఉద్యమం అలాంటిదేనా?
  • రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కూర్చోబెట్టుకున్నారు
  • మీది ధర్మ పోరాట దీక్ష కాదు 420 దీక్ష

జపాన్ తరహాలో పని చేస్తూ ఉద్యమాలు చెయ్యాలని చెప్పిన చంద్రబాబు, నిన్న తన ధర్మపోరాట దీక్షను ఆ విధంగా చేయలేదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని తన ముందు కూర్చోబెట్టుకుని చంద్రబాబు ఈ దీక్ష చేశారని అన్నారు.

‘అయ్యా, చంద్రబాబునాయుడుగారు! నిన్న మీరు చేసిన నిరాహారదీక్షా ఉద్యమం పని చేస్తూ చేసిన ఉద్యమమేనా? రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ పనీపాటా లేకుండా చేసి మీ ముందు కూర్చోబెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ, సీపీఐ, సీపీఎంలు, జనసేన పార్టీ మీకు మద్దతు ఇవ్వలేదు. మీరేమో ధర్మ పోరాట దీక్ష అంటున్నారు కానీ, ప్రజలను మోసం చేసే దీక్ష ఇది. ఇది 420 దీక్ష. ఈ దీక్షలో పాల్గొనమని చెప్పిన పార్టీల వాళ్లందరూ ద్రోహులట! ;ప్రభుత్వ సొమ్ముతో చేసిన నిరాహార దీక్ష ఇది. కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత తనపై దాడి చేస్తున్నారనే స్వరాన్ని వినిపించడానికి చంద్రబాబు నిన్న తీవ్రంగా ప్రయత్నం చేశారు. మోదీతోను, వారి తాబేదార్లతోనూ చంద్రబాబు ఇంకా రహస్య మంతనాలు చేస్తున్నారు’ అని విమర్శించారు.

More Telugu News