bjp: రాజకీయాలకు, బీజేపీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత యశ్వంత్ సిన్హా

  • ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటాను
  • రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా
  • బీజేపీతో ఉన్న అన్ని సంబంధాలు తెగదెంపులు చేసుకుంటున్నా
  • పాట్నాలో యశ్వంత్ సిన్హా వెల్లడి

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో కొన్నేళ్లుగా విభేదిస్తున్న యశ్వంత్ సిన్హా పార్టీ నుంచి బయటకొచ్చేస్తున్నట్టు చెప్పారు. యశ్వంత్ సిన్హా, శత్రుఘ్నసిన్హా కలిసి పొలిటికల్ యాక్షన్ గ్రూప్ ‘రాష్ట్ర మంచ్’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పాట్నాలో రాష్ట్ర మంచ్ ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న రిపోర్టర్లను హత్యలు చేయిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని, బీజేపీతో ఉన్న అన్ని సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నానని అన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, సమాజ్ వాదీ, తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.

కాగా, 2002-04 మధ్య కాలంలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో విదేశాంగ శాఖా మంత్రిగా, తిరిగి 1998-2002 లో ఆర్థిక శాఖా మంత్రిగా యశ్వంత్ సిన్హా పని చేశారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ కేబినెట్ లో యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా మంత్రిగా ఉన్నారు. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు.

More Telugu News