Pawan Kalyan: పవన్ ఆరోపణలపై చంద్రబాబు విచారణ జరిపించాలి : మాణిక్యాలరావు డిమాండ్

  • మీడియాను వినియోగించి దుష్ప్రచారం చేయడం దారుణం
  • టీడీపీని వ్యతిరేకించే వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు
  • బాలకృష్ణపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
  • చంద్రబాబు దీక్షకు ప్రజాధనాన్ని దుర్వినియోగ పరిచారు

పది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించాలని, దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేత మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మీడియాను వినియోగించి దుష్ప్రచారం చేయడం దారుణమని, నాడు ఎన్టీఆర్ ని పదవీచ్యుతిడిని చేసినప్పుడు అబద్ధాలు ఎలా చెప్పారో, ఇప్పుడూ అలాగే జరుగుతోందని, టీడీపీని వ్యతిరేకించే వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. 

ప్రధానిపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు వింటూ నవ్వుతున్నారని విమర్శించారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ధర్మపోరాట దీక్షపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అట్టహాసంగా చేసిన దీక్షకు ప్రజాధనాన్ని దుర్వినియోగ పరిచారని, రూ.200 కోట్ల నష్టం జరిగిందని ఆరోపించారు.

More Telugu News