Pawan Kalyan: ఏదో చేస్తానన్న పవన్ ఏమీ చేయలేదు... శ్రీరెడ్డి వ్యవహారం మాయని మచ్చే: చిత్తూరు ఎంపీ శివప్రసాద్

  • అవిశ్వాసం పెడితే ఢిల్లీకి వస్తానని చెప్పిన పవన్
  • బీజేపీని ఇప్పుడు ఒక్క మాట కూడా అనడం లేదు
  • శ్రీరెడ్డి చెబుతున్నవి 1940 నుంచి ఉన్నవే
  • పరస్పర అంగీకారంతో జరిగే రహస్య కార్యక్రమమే

జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ కోసం ఏదో చేస్తానని చెప్పి, చివరకు ఏమీ చేయలేదని చిత్తూరు ఎంపీ, టీడీపీ నేత శివప్రసాద్ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గంలో ఉన్న ఆయన, కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన వెంటనే ఢిల్లీకి వస్తానని చెప్పిన పవన్, ఆ పని చేయలేదని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పిన పవన్, ఎలాంటి ఒత్తిడీ చేయకుండా మౌనంగా ఉండిపోయారని, బీజేపీని ఒక్క మాట కూడా అనకపోవడం వెనుకున్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

 ఆనందంగా జన్మదినాన్ని చేసుకోవాల్సిన చంద్రబాబు, మోదీ పాపానికి నిరాహార దీక్షతో జరుపుకున్నారని వ్యాఖ్యానించారు. నటి శ్రీరెడ్డి చేసిన పనికి టాలీవుడ్ పై మాయని మచ్చ పడిందని, ఆమె చెప్పే చీకటి వ్యవహారాలు 1940 నుంచే ఉన్నాయని శివప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇద్దరి పరస్పర అంగీకారంతో జరిగే రహస్య కార్యక్రమాలను బయట చెప్పడం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు.

తమకు అన్యాయం జరిగిందని భావిస్తే, న్యాయం కోసం సినిమా సంఘాలున్నాయని, వాటిని నమ్మలేకుంటే పోలీసులను ఆశ్రయించవచ్చని సూచించారు. ఏవో విమర్శలు చేసి, వాటిపై సినీ ప్రముఖులు మాట్లాడటం లేదని విమర్శలు వేస్తూ నిందించడం సరికాదని చెప్పారు. సినిమా ఇండస్ట్రీని భ్రష్టు పట్టించేందుకు కొందరు చేసిన కుట్రే ఇదని చెప్పారు.

More Telugu News