virendra sehwag: 'అప్పుడు మీరు ప్రేమించకపోతే.. ఇప్పుడు మీకా అర్హత లేదు': ఆసక్తికర ట్వీట్ చేసిన సెహ్వాగ్

  • సన్ రైజర్స్ తో మ్యాచ్ లో సెంచరీ చేసిన గేల్
  • గేల్ వైఫల్యం, విజయంతో కూడిన ఫొటోలు పెట్టి ట్వీట్ చేసిన సెహ్వాగ్
  • ట్వీట్ కు అభిమానుల ఆదరణ

టీమిండియా దిగ్గజ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఆసక్తికర ట్వీట్లతో అభిమానులను అలరిస్తాడు. తాజాగా అభిమానుల వ్యవహారశైలిని ఎత్తిచూపుతూ ఆసక్తికర ట్వీట్ చేసి సెహ్వాగ్ ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ లో భాగంగా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తో జరిగిన మ్యాచ్‌ లో కింగ్స్‌ ‌ఎలెవన్ పంజాబ్ ఆటగాడు క్రిస్‌ గేల్‌ అజేయ శతకంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు గేల్ ఫాంలో లేడు. పేలవమైన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒక దశలో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ వేలంలో గేల్ ను తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. సుమారు పదేళ్లపాటు ఆడిన బెంగళూరు జట్టు అతనిని వదిలించుకుంది.

రెండు విడతలుగా సాగిన వేలం పాటలో గేల్ ను ఎవరూ కొనుగోలు చేయలేదు. మూడో దఫా వేలంలో కనీస ధరకు గేల్ ను ప్రీతీ జింటా సారధ్యంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. తొలి రెండు మ్యాచ్ లలో ఆడించకుండా మూడో మ్యాచ్ లో బరిలోకి దింపింది. తొలి మ్యాచ్ లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న గేల్ తరువాతి మ్యాచ్ లో 11 సిక్సర్లతో సెంచరీ చేసి అదరగొట్టాడు.

ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌.. గేల్ ఫొటోలు రెండు పెడుతూ ట్వీట్‌ చేశాడు. తొలి చిత్రంలో గేల్‌ డకౌట్‌ అయిన్నట్టు ఉండగా, రెండో ఫొటోలో సెంచరీ చేసిన తరువాత ఐపీఎల్ లో గేల్ సిగ్నేచర్ పోజ్ ను పెట్టాడు. దీన్లో తొలి ఫొటోకు 'నేను డక్కౌట్ అయినప్పుడు మీరు నన్ను ప్రేమించకపోతే..' అంటూ క్యాప్షన్ ఇవ్వగా... రెండో ఫొటోకు 'నేను సెంచరీ చేసినప్పుడు ఆనందించే అర్హత మీకు లేదు..' అంటూ వ్యాఖ్యానించాడు. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెంపపెట్టు అని అభిమానులు పేర్కొంటున్నారు.

More Telugu News