Narendra Modi: నన్ను దెబ్బతీయొచ్చని అనుకుంటున్న మోదీకి నేను చెప్పేదొకటే..! : సీఎం చంద్రబాబు

  • వైసీపీ లేదా పవన్ లాంటి వాళ్లతో లాలూచీ పడి నన్ను దెబ్బతీయొచ్చని మోదీ అనుకుంటున్నారు
  • నేను ప్రజల పక్షాన ఉన్నా..ధర్మపోరాటం చేస్తున్నా
  • ఎన్నిశక్తులు ఉపయోగించినా అది వల్ల కాదు
  • రాజకీయాల్లో ఎవరైతే లాలూచీ పడతారో వాళ్లే ఫినిష్ అవుతారు

ఏపీలో లాలూచీ రాజకీయాలు నడపాలని ప్రధాని నరేంద్ర మోదీ చూస్తున్నారంటూ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విజయవాడలో ధర్మపోరాట దీక్ష విరమించిన అనంతరం, ఆయన ప్రసంగిస్తూ, ‘ఏపీలో వైసీపీతోనో లేక పవన్ కల్యాణ్ లాంటి వాళ్లతోనో లాలూచీ పడితే నన్ను దెబ్బ తీయొచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అనుకుంటున్నారు! నేను ప్రజల పక్షాన ఉన్నాను. ధర్మపోరాటం చేస్తున్నాను. ఈ ధర్మ పోరాటాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి మీరు ఎన్ని శక్తులు ఉపయోగించినా అది మీ వల్ల కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కేంద్రాన్ని హెచ్చరిస్తున్నా.

నా జీవితంలో నేనెప్పుడూ ప్రజల పక్షానే ఉంటాను. ప్రజలు నా పక్షాన ఉంటే ఎన్ని ఇబ్బందులొచ్చినా అధిగమిస్తాను. రాజకీయ పార్టీల నాయకుల అవకాశవాదానికి హద్దుల్లేకుండా పోయాయి. ఒక నిమిషంలో మాట్లాడిన మాట ఇంకో నిమిషంలో మాట్లాడటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నా.. నన్ను ఇబ్బంది పెట్టలేరు.

లాలూచీ రాజకీయాలనేవి నా జీవితంలో లేవు. రాజకీయాల్లో ఎవరైతే లాలూచీ పడతారో వాళ్లే ఫినిష్ అయిపోయే పరిస్థితి వస్తుంది!  కేంద్ర ప్రభుత్వంతో మనం విభేదించాం. మనం న్యాయం కోసం పోరాడుతున్నాం. న్యాయం కోసం పోరాడుతున్నామని అవతల వాళ్లకు అనిపిస్తే.. కరెక్టు చేస్తారు. అలా కాకుండా, మీరు మమ్మల్ని అడిగేవాళ్లా? అడిగే ధైర్యం మీకొచ్చిందా? అనే అహం భావం వస్తే మనమీద ఒత్తిళ్లు పెంచుతారు. అనేక విధాలుగా ఒత్తిళ్లు పెంచే అవకాశం ఉంది’ అని అన్నారు.

More Telugu News