Supreme Court: ప్రధాన న్యాయమూర్తి అభిశంసనపై మీడియా కవరేజ్ ను నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్!

  • అభిప్రాయాలు తెలియజేయాలని అటార్నీ జనరల్ ను కోరిన సుప్రీంకోర్టు
  • విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా
  • దీనిపై బహిరంగ చర్చ జరగడం దురదృష్టకరమని వ్యాఖ్య

న్యాయమూర్తి అభిశంసనపై బహిరంగ చర్చ జరగడం చాలా దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనకు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే. ఈ అంశాన్ని మీడియా కవర్ చేయకుండా నిరోధించాలని కోరుతూ పూణెకు చెందిన న్యాయవాద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీంతో ప్రధాన న్యాయమూర్తి అభిశంసనను మీడియా కవర్ చేయకుండా నిషేధించడంపై అభిప్రాయాలు తెలియజేయాలని అటార్నీజనరల్ ను సుప్రీంకోర్టు కోరింది. అయితే, మీడియాను నిషేధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అటార్నీ జనరల్ నుంచి స్పందన వచ్చేంత వరకు వేచి ఉండాలని సూచిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా రాజకీయ నేతల ప్రకటనలను ఉదహరిస్తూ దీనిపై తాము ఎంతో కలత చెందుతున్నట్టు కోర్టు పేర్కొంది.

More Telugu News