Pakistan: ‘పాడిందే పాడరా..’ అన్నట్టు.. భారత్ అదే పాటను పదేపదే పాడుతోంది: పాకిస్థాన్

  • సర్జికల్ స్ట్రైక్స్ బూటకం
  • భారత్ పదేపదే అబద్ధాలు చెబుతోంది
  • ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండించిన పాక్

భారత్ మాపై సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదు మొర్రో అని చెబుతున్నా భారత్ మాత్రం అరిగిపోయిన రికార్డులా అదే పాట పదేపదే పాడుతోందని పాకిస్థాన్ ఆక్షేపించింది. బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత భద్రతా దళాలు పాక్‌లో విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భారత ప్రజలకు చెప్పడానికి ముందే పాకిస్థాన్‌కు తెలియజేశామని వివరించారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల ఎగుమతి కార్ఖానాగా మారిందని ఆరోపించారు. వారికి వారి భాషలోనే సమాధానమిచ్చామని వివరించారు.

మోదీ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ శాఖ స్పందించింది. తమ దేశంపై అసలు సర్జికల్ స్ట్రైక్స్ అనేవే జరగలేదని, భారత్ మాటలు బూటకమని కొట్టిపడేసింది. జరగని విషయాన్ని జరిగినట్టు పదేపదే చెబుతోందని విమర్శించింది. అరిగిపోయిన రికార్డులా పదేపదే అదే మాటను వల్లెవేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

More Telugu News