Tamilnadu: ముఖం పదేపదే కడుక్కున్నా మలినం వదలట్లేదు!: తమిళనాడు మహిళా జర్నలిస్టు

  • తాతయ్య వయసులో ఉన్న మీ ప్రవర్తన తప్పు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా జర్నలిస్టు
  • యువతి గౌరవానికి భంగం కలిగించడం సభ్యత కాదన్న కనిమొళి

లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మహిళ ఎవరో తనకు తెలియదని చెప్పేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గవర్నర్ తనను అసభ్యంగా తాకడం ఎంతవరకూ సబబని, మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం మంచి పద్ధతా? అని తమిళనాడు మహిళా జర్నలిస్టు ప్రశ్నించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, విలేకరుల సమావేశంలో భాగంగా తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకారు’ అంటూ ట్వీట్‌ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇలా చేయడం సబబు కాదని చెప్పారు. "నా ముఖాన్ని పదేపదే శుభ్రం చేసుకున్నా ఆ మురికి వదిలినట్లు నాకు అనిపించడం లేదు. 78 ఏళ్ల వయసులో ఉన్న మీరు నాకు తాతయ్య వంటి వారే కావచ్చు. కానీ మీ ప్రవర్తన నాకు తప్పుగా అనిపిస్తోంది" అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, ఈ సంఘటనపై విపక్ష డీఎంకే నిప్పులు చెరిగింది. గవర్నర్ చర్యను ఖండిస్తూ, ఉన్నత స్థితిలో ఉన్న గవర్నర్ చేసిన పని మంచిది కాదని ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చని, ఓ యువతి గౌరవానికి భంగం కలిగించడం మాత్రం సభ్యత అనిపించుకోదని ట్వీట్‌ చేశారు.

More Telugu News