jeevitha: పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవ్వరూ ఊరుకోరు..!: జీవిత వార్నింగ్‌

  • ఎవ్వరూ అడగరనుకుంటున్నారా? 
  • నాపై చేసిన ఆరోపణలకు సమాధానం వచ్చేవరకు ఊరుకోను
  • శ్రీరెడ్డికి టీవీల్లో అంతగా ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు?

టీవీల్లో డిబేట్లు పెట్టి సెలబ్రిటీల గురించి మాట్లాడితే తాను ఇక ఊరుకోనని సినీనటి, ప్రొడ్యూసర్‌ జీవిత రాజశేఖర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఈ రోజు ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... 'ఎవ్వరూ అడగరనుకుంటున్నారా? మిమ్మల్ని అడిగేవారు ఎవ్వరూ లేరనా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడ ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు.. చేతులకి గాజులు తొడుక్కుని కూర్చోలేదు. ఆ విషయం తెలుసుకోవాలి సంధ్య గారూ... నేనిప్పటికి కూడా సంధ్య గారూ అనే అంటున్నాను. నాపై చేసిన ఆరోపణలకు సమాధానం వచ్చేవరకు ఊరుకోను' అని వార్నింగ్‌ ఇచ్చారు.

శ్రీరెడ్డికి అంతగా ప్రాధాన్యత ఎందుకు?

'శ్రీరెడ్డికి టీవీల్లో అంతగా ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? సినిమాలో పాత్రలు ఎలా ఇస్తారు? ఒక సినిమా తీయాలంటే ఎంతగా ఖర్చు చేయాలో, ఎంతగా కష్టపడాలో నాకు తెలుసు. ఎటువంటి ఆర్టిస్టులను తమ సినిమాల్లో పెట్టుకోవాలనే విషయంలో ప్రొడ్యూసర్లు, దర్శకులు ఎంతగానో ఆలోచిస్తారు. టీవీల్లో వస్తోన్న న్యూస్‌లను చూసి ఎవరో చెప్పింది విని అదంతా నిజమని నమ్మొద్దు. ఒకరు బాగా నటించగలరు అనుకుంటే వారికి అవకాశం ఇస్తారు.

ఒకవేళ సినిమాకి నష్టం వస్తే ఎవరు భరిస్తారు? సినిమా పరిశ్రమలో అవకాశం ఇచ్చే క్రమంలో మోసాలు జరగడం లేదని నేను అనడం లేదు. అన్ని పరిశ్రమల్లో మోసాలు ఉంటాయి. అలాగే సినీ పరిశ్రమలో కూడా ఉంటాయి. ఎప్పుడు ఏ మహిళకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినా అందుకు కారకులపై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు' అని జీవిత వ్యాఖ్యానించారు. 

More Telugu News