KCR: మొన్న మమతా బెనర్జీ, నిన్న దేవెగౌడ, రేపు నవీన్ పట్నాయక్... వేగం పెంచిన కేసీఆర్!

  • ఇప్పటికే మమత, దేవెగౌడలతో చర్చలు
  • తదుపరి నవీన్ పట్నాయక్ తో
  • మే తొలివారంలో నేతల భేటీ!

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో తృతీయ కూటమిని ఏర్పాటు చేస్తానని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఈ క్రమంలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత నెలలో కోల్ కతా వెళ్లి పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కలిసి థర్డ్ ఫ్రంట్ పై చర్చించిన ఆయన, గతవారం స్పెషల్ ఫ్లయిట్ వేసుకుని బెంగళూరు వెళ్లి జేడీ (ఎస్) నేత, మాజీ ప్రధాని దేవేగౌడతో మాట్లాడి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తదుపరి కేసీఆర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను కలవాలని నిర్ణయించుకున్నారు.

మే తొలి వారంలో వీరిద్దరి కలయిక ఉంటుందని జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. జాతీయ స్థాయి కూటమిపై వీరి మధ్య చర్చలు జరగనున్నాయని తెలిపింది.
కాగా, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సైతం ఇటీవల తెలంగాణ వచ్చి, కేసీఆర్ తో మాట్లాడి వెళ్లారు. మరింతమంది ప్రాంతీయ పార్టీల నేతలను కలుసుకుని ప్రజా ఫ్రంట్ ఏర్పాటుపై సాధ్యమైనంత త్వరగా ఓ నిర్ణయానికి రావాలన్నది కేసీఆర్ అభిమతంగా తెలుస్తోంది. 

More Telugu News