rescue team: పది రోజుల క్రితం అదృశ్యమైన భారతీయ కుటుంబం.. నదిలో నుంచి రెండు మృతదేహాలు వెలికితీత

  • తండ్రి, కుమార్తె మృతదేహాలను వెలికి తీసిన రెస్క్యూ సిబ్బంది
  • కొనసాగుతున్న గాలింపు చర్యలు
  • చివరిసారిగా ఈనెల 5న కనిపించిన కుటుంబం

పది రోజుల క్రితం పోర్ట్‌ల్యాండ్ నుంచి శాన్‌జోస్‌కు కారులో వెళ్తూ అదృశ్యమైన భారతీయ కుటుంబానికి చెందిన మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను సందీప్ తొట్టపల్లి (41), అతడి కుమార్తె సాంచి (9)గా గుర్తించారు. సందీప్ భార్య సౌమ్య (38) మృతదేహం ఇప్పటికే లభ్యం కాగా, కుమారుడు సిద్ధాంత్ (12) బాడీ దొరకాల్సివుంది.

వీరి మృతదేహాల కోసం గాలిస్తున్న అమెరికా రెస్క్యూ బృందం సోమవారం కాలిఫోర్నియా నదిలో నాలుగు ఆడుగుల లోతులో ఉన్న కారులో చిక్కుకుపోయిన ఇద్దరి మృతదేహాలను వెలికి తీసింది. కాగా, సిద్ధాంత్ మృతదేహం కోసం గాలింపు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.

శాన్‌జోస్ పోలీసుల కథనం ప్రకారం.. తొట్టపల్లి కుటుంబం ఏప్రిల్ 6న శాన్‌జోస్‌లో ఉన్న తన స్నేహితుడి ఇంటికి బయలుదేరింది. అయితే, వారు చేరుకోకపోవడం, వారి ఆచూకీ తెలియకపోవడంతో స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఏప్రిల్ 8న వీరి ఆచూకీ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొట్టపల్లి కుటుంబం చివరిసారిగా ఈనెల 5న డెల్ నార్టె కౌంటీలో కనిపించింది. సూరత్‌కు చెందిన తొట్టపల్లి కుటుంబం 15 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడింది.

More Telugu News