Marriage: స్కైప్ ద్వారా విడాకులు ఇచ్చేందుకు ఎన్‌ఆర్ఐకి బాంబే హైకోర్టు అనుమతి!

  • విచారణకు హాజరు కాని పిటిషన్‌దారు
  • అభ్యర్థనను కొట్టేసిన కుటుంబ న్యాయస్థానం
  • గ్లోబలైజేషన్ వల్ల యువత దేశాలు దాటుతోందన్న హైకోర్టు
  • విడాకుల మంజూరులో సాంకేతికతను ఉయోగించుకోవాలని ఆదేశం

పరస్పర అంగీకారంతో విడిపోతున్న ఓ ఎన్ఆర్ఐ జంటకు స్కైప్ ద్వారా విడాకులు ఇవ్వాలంటూ బాంబే హైకోర్టు ఆదేశించింది. 2002లో జలగాంలో పెళ్లి చేసుకున్న జంట 2016 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు విడాకులు ఇప్పించాల్సిందిగా కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే మహిళ కోర్టుకు హాజరుకాకపోవడంతో విడాకుల కోసం వారు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఉద్యోగ రీత్యా మహిళ అమెరికాలో ఉండడంతో ఆమె కోర్టుకు హాజరు కావడం వీలుకాలేదని ఆమె తరపు న్యాయవాది సమీర్ వైద్య తెలిపారు. పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

సాంకేతికత అభివృద్ధి చెందిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడాకులు మంజూరు చేయాలని వేడుకున్నారు. దీనికి అంగీకరించిన న్యాయస్థానం స్కైప్, లేదంటే మరో మాధ్యమం ద్వారా విడాకులు ఇచ్చేందుకు అంగీకరించింది. గ్లోబలైజేషన్ కారణంగా యువత దేశాల సరిహద్దులు దాటుతోందని పేర్కొన్న న్యాయస్థానం పిటిషన్‌దారు కోర్టులో హాజరు కావాల్సిన అవసరం లేదంటూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. స్కైప్ ద్వారా విడాకులు మంజూరు చేయాలని ఆదేశించింది.

More Telugu News