Narendra Modi: లండన్ సెంట్రల్ హాల్‌ వెస్ట్ మినిస్టర్‌ నుంచి మోదీ ప్రసంగం.. గాంధీ తర్వాత మోదీనే!

  • స్వీడన్, ఇంగ్లండ్‌లలో ఐదు రోజుల పర్యటనకు మోదీ
  • వాణిజ్య, పెట్టుబడి బంధాలు మరింత బలోపేతమే లక్ష్యం
  • మోదీ ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా లైవ్

స్వీడన్, ఇంగ్లండ్‌లలో ఐదు రోజుల పర్యటన నిమిత్తం నేడు బయలుదేరనున్న ప్రధాని నరేంద్రమోదీ మరో చరిత్ర సృష్టించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు సహా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఉద్దేశించిన ఈ పర్యటనకు సంబంధించి మోదీ స్వయంగా తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు.

నేటి రాత్రి స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్‌లాండ్‌తో జరిగే సదస్సులో ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. మంగళవారం బ్రిటన్ వెళ్లనున్న ప్రధాని బుధ, గురువారాల్లో 52 సభ్యదేశాలైన ‘చోగం’ సదస్సులో పాల్గొననున్నారు. అలాగే లండన్‌లోని చారిత్రక సెంట్రల్ హాల్ వెస్ట్‌మినిస్టర్ నుంచి మోదీ ప్రసంగించనున్నారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేస్తారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా వచ్చిన పలు ప్రశ్నలకు మోదీ తన ప్రసంగం ద్వారా సమాధానం ఇస్తారు.

వెస్ట్‌మినిస్టర్ నుంచి ప్రసంగించడం ద్వారా మోదీ సరికొత్త చరిత్రను లిఖించనున్నారు. 1931లో మహాత్మాగాంధీ ఇక్కడి నుంచి ప్రసంగించారు. మళ్లీ ఇన్నాళ్లకు మోదీ ప్రసంగించనున్నారు. తద్వారా వెస్ట్‌మినిస్టర్‌లో ప్రసంగించిన రెండో భారతీయుడిగా మోదీ రికార్డు నెలకొల్పనున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొననున్న 2 వేల మందిని ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా ఎంపిక చేశారు.

వెస్ట్‌మినిస్టర్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్, దలైలామా, యువరాణి డయానా వంటి వారు కూడా ఇక్కడి నుంచే ప్రసంగించారు. 1946లో ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం మొదటిసారి ఇక్కడే జరిగింది.

చోగం సదస్సు ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ ప్రధాని థెరిసా మే.. మోదీతో రెండుసార్లు సమావేశం కానున్నారు. రాణి ఎలిజబెత్-2 ఇచ్చే విందులో పాల్గొననున్న మోదీ అనంతరం థేమ్స్ నది ఒడ్డునున్న వున్న సామాజిక సంస్కర్త బసవేశ్వరుడి విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు.

More Telugu News