Smart Phones: భారీగా తగ్గిన స్మార్ట్ ఫోన్ల ధరలు... రూ. 11 వేల వరకూ దిగొచ్చిన ఫోన్ల వివరాలు!

  • గణనీయంగా తగ్గిన స్మార్ట్ ఫోన్ ధరలు
  • ధరల తగ్గింపును ప్రకటించిన శాంసంగ్, హెచ్టీసీ, షియోమీ 
  • కొత్త మోడల్స్ రావడంతోనే ధరల తగ్గింపు

స్మార్ట్ ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గాయి. శాంసంగ్, హెచ్టీసీ, వివో, మోటరోలా, నోకియా, ఆసుస్ వంటి ఎన్నో కంపెనీలు తమ ఫోన్ల ధరలను రూ. 11 వేల వరకూ తగ్గిస్తున్నట్టు ఇటీవల ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఏ ఫోన్ ధర ఏ మేరకు తగ్గిందో పరిశీలిస్తే...
* శాంసంగ్ తానందిస్తున్న గెలాక్సీ ఎస్8 ప్లస్ ధరను రూ. 64,900 నుంచి రూ. 53,900కు తగ్గించింది. ఆండ్రాయిడ్ ఓరియోపై పనిచేసే ఈ ఫోన్ ధరను రూ. 11 వేలు తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. 6.2 అంగుళాల డిస్ ప్లే 4 జీబీ రామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ దీని ప్రత్యేకతలు.
* ఇక ఇదే సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ధరను రూ. 57,900 నుంచి రూ. 7,910 తగ్గిస్తూ, రూ. 49,990గా ప్రకటించింది. ఇన్ఫినిటీ ఎడ్జ్ డిస్ ప్లే, 12/8 ఎంపీ కెమెరాలు దీని ప్రత్యేకత.
* నోకియా సంస్థ తన నోకియా 8 మోడల్ పై రూ. 8 వేల తగ్గింపును ప్రకటించింది. ఇప్పటివరకూ రూ. 36,999గా ఉన్న ఈ ఫోన్ ఇకపై రూ. 28,999కి లభ్యమవుతుందని తెలిపింది. 5.3 అంగుళాల క్వాడ్ హెచ్డీ డిస్ ప్లే, 4 జీబీ రామ్, 64 జీబీ మెమొరీ దీని ప్రత్యేకతలు.
* హెచ్టీసీ సంస్థ తన యూ 11 ధరను రూ. 5,991 మేరకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ ఫోన్ ఇకపై రూ. 45,999కి లభిస్తుందని తెలిపింది. ఆండ్రాయిడ్ నోగట్ 7 ఆపరేటింగ్ సిస్టమ్, 6 జీబీ రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ దీని ప్రత్యేకత.
* ఆనర్ సంస్థ తన డ్యూయల్ కెమెరా మోడల్ ఆనర్ 8 ధరను రూ. 29,999 నుంచి రూ. 4 వేలు తగ్గించి రూ. 25,999గా ప్రకటించింది. 5.7 అంగుళాల డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ దీని ప్రత్యేకత.
* శాంసంగ్ సంస్థ తన గెలాక్సీ ఏ8 ప్లస్ ధరను రూ. 2 వేలు తగ్గిస్తూ, రూ. 30,990గా ప్రకటించింది. 16/8 ఎంపీ కెమెరాలు, 6 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే దీని ప్రత్యేకతలు.
* సంచలనం సృష్టించిన షియోమీ రెడ్ మీ 5 స్మార్ట్ ఫోన్ ధరను రూ. 500 తగ్గిస్తున్నట్టు షియోమీ వెల్లడించింది. ఈ ఫోన్ ను ఇకపై 3 జీబీ రామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ను రూ. 8,499కి పొందవచ్చని తెలిపింది. ఇక 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 10,499కు లభిస్తుందని పేర్కొంది.
* జీ5 ఎస్ మోడల్ స్మార్ట్ ఫోన్ ధరను రూ. 4 వేలు తగ్గిస్తున్నట్టు మోటో ప్రకటించింది. రూ. 16,999గా ఉన్న ఫోన్ ఇకపై రూ. 12,999కి లభిస్తుందని తెలిపింది. 5.5 అంగుళాల డిస్ ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్, 13/8 ఎంపీ కెమెరాలు దీని ప్రత్యేకత.

ఇక నోకియా 6 ధర రూ. 2 వేలు తగ్గగా, మోటో జీ5 ప్లస్ ధర రూ. 5 వేలు, వివో వీ7 ధర రూ. 2 వేలు, ఒప్పో ఏ71 ధర రూ. 3 వేలు, నోకియా 5 ధర రూ. 1 వెయ్యి, బ్లాక్ బెర్రీ కీ వన్ ధర రూ. 4 వేలు, ఆసూస్ జెన్ ఫోన్ ధర రూ. 2 వేలు తగ్గింది. పలు రకాల కొత్త మోడల్స్ మార్కెట్లోకి రావడంతోనే పాత మోడల్ ధరలను కంపెనీలు తగ్గించాయని ఈ రంగంలోని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

More Telugu News