Facebook: ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ ను ఉక్కిరిబిక్కిరి చేసి.. నీళ్లు తాగించిన యూఎస్ కాంగ్రెస్!

  • 5 గంటల పాటు ప్రశ్నల వర్షం 
  • 44 మంది సెనెటర్ల దాడితో ఇబ్బందిపడ్డ మార్క్
  • కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్న ఫేస్ బుక్ చీఫ్

దాదాపు 44 మంది యూఎస్ కాంగ్రెస్ సభ్యులు 5 గంటల పాటు ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఆయన నీళ్లు నమలాల్సి వచ్చింది. తమ ప్రశ్నలతో సెనెటర్లు మార్క్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. పలు వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలు అడిగారు. గత రాత్రి ఏ హోటల్ లో ఉండి, ఏం చేశారన్న ప్రశ్నకు ఆయన సమాధానాన్ని నిరాకరించగా, వ్యక్తిగత గోప్యత అటువంటిదేనని, నమ్మి సమాచారాన్ని మీ వద్ద దాచుకుంటుంటే చోరీ జరగడం ఏంటని సెనెటర్ డిక్ డర్బిన్ కౌంటరేశారు.

భవిష్యత్తులోనూ ఫేస్ బుక్ స్వీయ నియంత్రణ పాటిస్తుందన్న నమ్మకం తమకు లేదని మార్క్ ను విచారించిన అత్యధిక సెనెటర్లు అభిప్రాయపడ్డారు. ఫేస్ బుక్ యూజర్ల వివరాలను కేంబ్రిడ్జ్ అనలిటికా తొలగించిందని నమ్మారా? అన్న ప్రశ్నకు తాను నమ్మానని, అది పెద్ద తప్పిదమేనని అన్నాడు. ఫేస్ బుక్ లో భవిష్యత్తులో డేటా చోరీ జరగకుండా చూసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. తాము ఎన్నడూ వినియోగదారుల సంభాషణపై నిఘా పెట్టలేదని చెప్పారు. ఇకపై ఫోన్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీల ద్వారా ఇతరులను సెర్చ్ చేసే ఆప్షన్ ను తొలగించామని, పోస్టులను షేర్ చేయడానికి పరిమితుల్ని విధించామని, యాప్ లను అభివృద్ధి చేసే వారికి ఫేస్ బుక్ డేటాను దూరం చేశామని అన్నారు.

More Telugu News