Jammu And Kashmir: కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. సిక్కోలు జవాను వీర మరణం

  • రెండు నెలల క్రితమే సెలవుపై ఇంటికొచ్చిన జవాను
  • అంతలోనే ఉగ్రవాదుల తూటాలకు బలి
  • కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకానికి శ్రీకాకుళానికి చెందిన ఓ జవాను అమరుడయ్యాడు. ఖుద్వానీలో లష్కరే తాయిబా ఉగ్రవాదులు దాక్కున్నట్టు సమాచారం అందడంతో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. వారు నక్కిన ఇంటిని జవాన్లు చుట్టుముట్టారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ప్రతిగా భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ఏఎస్‌ కవిటి గ్రామానికి చెందిన సాద గుణకరరావు (25) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీర మరణం పొందాడు.

గుణకరరావు మృతి వార్త తెలియడంతో స్వగ్రామం ఏఎస్ కవిటిలో విషాద ఛాయలు అలముకున్నాయి. రెండు నెలల కిందటే సెలవుపై ఇంటికి వచ్చిన గుణకరరావుకు త్వరలోనే పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అంతలోనే అతడి మరణవార్త ఆ కుటుంబంలో విషాదం నింపింది. గుణకరరావు మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

More Telugu News