Telangana: పెళ్లి కానుకగా తులం బంగారం, ఉంగరం, మెట్టెలు, వస్త్రాలు... తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే చింతల బంపరాఫర్!

  • ప్రజలతో మమేకం అయ్యేలా సరికొత్త పథకం
  • వధూవరులకు ప్రత్యేకంగా కిట్
  • మేళతాళాలతో వచ్చి అందిస్తామన్న చింతల

కాబోయే వధూవరులకు ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి బంపరాఫర్ ఇచ్చారు. ప్రజలతో మమేకం అయ్యేలా, వారి కుటుంబీకుల్లో ఒకరిగా మారేలా ఓ పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. పేదల ఇంట వివాహం జరిగితే వారి కుటుంబీకుడిగా తాను మారతానని చెప్పారు. నూతన వధూవరులకు తులం బంగారంతో పుస్తెలు, ఉంగరం అందిస్తానని, వీటికి తోడు రెండు తులాల బరువైన వెండి మెట్టెలు, నూతన వస్త్రాలతో కూడిన కిట్ ను ఇస్తామని, కులాలు, మతాలతో సంబంధం లేని విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తానని అన్నారు.

ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటుంటే, తమ వివాహ కార్డును, కిట్ కోసం దరఖాస్తును, ఆధార్ కార్డు తదితరాలను జత చేయాలని కోరారు. పెళ్లి సమయంకన్నా ముందే ఈ కిట్ ను అందిస్తామని, లబ్దిదారుల ఎంపిక డివిజన్ బీజేపీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో మహిళా మోర్చా కార్యకర్తలు మేళతాళాలతో వచ్చి, అందరి సమక్షంలో ఈ కానుకను ఇస్తారని చెప్పారు.

More Telugu News