Kamareddy District: అల్లుడిని ఆసుపత్రి పాలు, మామను జైలు పాలు చేసిన టీవీ చానల్ వివాదం!

  • భోజనానంతరం ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న అల్లుడు వెంకటి
  • సీరియల్ చూడాలంటూ చానల్ మార్చిన మామ బుజ్జయ్య
  • ఘర్షణగా మారిన వాగ్వాదం

టీవీ చానల్ వివాదం అల్లుడిని ఆసుపత్రి పాలు చేయగా, మామను జైలు పాలు చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... బీర్కూర్‌ మండలం బరంగెడ్గి గ్రామంలో నివసించే మంగలి బుజ్జయ్య.. ఐదేళ్ల క్రితం వెంకటి అనే యువకుడ్ని ఇల్లరికం తెచ్చుకున్నాడు. గత రాత్రి భోజనం చేసిన తరువాత అల్లుడు వెంకటి ఐపీఎల్ క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తుండగా, రిమోట్‌ తీసుకుని సీరియల్‌ చూడాలంటూ మామ బుజ్జయ్య చానల్‌ మార్చాడు.

 ఇది వాగ్వాదానికి దారితీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బుజ్జయ్య కత్తెరతో అల్లుడిపై దాడి చేశాడు. కత్తెర లోతుగా గుచ్చుకోవడంతో వెంకటికి తీవ్ర రక్తస్రావం జరిగి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారి సూచనతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి హైదరాబాదు నిమ్స్ కు తరలించారు. వెంకటి భార్య అక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, బుజ్జయ్యను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News