Telangana: సమ్మర్ ఎఫెక్ట్! తెలంగాణలో బీర్ల ధరల పెంపు!

  • బీర్ల ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్న బ్రూవరీలు
  • 12 శాతం ధరల పెంపునకు జస్టిస్ గోపాల్‌రెడ్డి కమిటీ సిఫారసు
  • ఏడాదికి రూ.300 కోట్ల అదనపు ఆదాయం
  • ఈ వారంలోనే ఉత్తర్వులు?

తెలంగాణలో బీర్ల ధరలను 12 శాతం మేరకు పెంచాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం ఇప్పుడు బీర్ల ధరలను పెంచడం ద్వారా నెలకు రూ.30 కోట్లు, ఏడాదికి రూ.300 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. ప్రతిపాదనలు సిద్ధమైన ఈ ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పెండింగ్‌లో ఉంది.

గత నాలుగేళ్లుగా బీర్ల ధరలు పెంచకపోవడంతో ఈసారి తప్పకుండా పెంచాల్సిందేనని బ్రూవరీ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక్కో బీరు బాటిల్‌పై రూ.6 చొప్పున బేసిక్ ధరపై 20 శాతం అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ధరల సమీక్షకు ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ గోపాల్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ 12 శాతం ధరలు పెంచేందుకు సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదన ఆధారంగా ఎక్సైజ్ శాఖ ధరల పెంపును ప్రతిపాదిస్తూ ఫైలును సీఎంకు పంపింది.  

టీఎస్‌బీసీఎల్ నివేదిక ప్రకారం రోజుకు 8 లక్షల మంది 13 లక్షల బీర్లు లాగించేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా గతేడాది ప్రభుత్వానికి రూ.15 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు బీర్ల ధరలను పెంచడం ద్వారా ఆదాయం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. బీర్ల ధరల పెంపుపై ఈ వారంలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

More Telugu News