Salman Khan: బెయిల్ వచ్చిన వెంటనే సల్మాన్ ఖాన్ మొదట ఎవరికి ఫోన్ చేశారో తెలుసా?

  • జైల్లో సందర్శకులను కలిసేందుకు ఆసక్తి చూపని సల్మాన్
  • బెయిల్ వచ్చిన వెంటనే తల్లికి ఫోన్
  • తల్లి ఆరోగ్యం గురించి ఆవేదన చెందిన స్టార్ హీరో

కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. అనంతరం జోధ్ పూర్ సెంట్రల్ జైల్లో సల్మాన్ రెండు రోజులు గడిపాడు. జైల్లో ఉన్న సమయంలో సల్మాన్ ఎక్కువగా తన తల్లి గురించే బాధపడ్డాడట. తనకు జైలు శిక్ష పడిన విషయం తెలిస్తే ఆమె తల్లడిల్లుతుందని సల్మాన్ బాధపడినట్టు స్థానిక జైళ్ల శాఖ డీఐజీ విక్రమ్ సింగ్ కర్ణావత్ తెలిపారు. తల్లి ఆరోగ్యం సరిగా లేదని ఆవేదన చెందేవారని చెప్పారు. సల్మాన్ ను కలిసేందుకు చాలా మంది జైలు వద్దకు వచ్చారని... అయితే వారందరినీ కలిసేందుకు సల్మాన్ ఎక్కువ ఆసక్తి చూపలేదని తెలిపారు.

వ్యాయామం కోసం సల్మాన్ ఎలాంటి పరికరాలు అడగలేదని... కేవలం ఫ్లోర్ ను మాత్రమే ఉపయోగించేవారని విక్రమ్ సింగ్ చెప్పారు. బెయిల్ వచ్చిన విషయాన్ని ఆయనకు చెప్పగానే... ఆయన ముఖంలో ఎలాంటి ఆనందం కనిపించలేదని... వెంటనే తల్లికి ఫోన్ చేసి మాట్లాడారని అన్నారు. ఆ తర్వాత స్నానం చేసి, తన దుస్తులను సర్దుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సల్మాన్ ను చూసేందుకు ఖైదీలు ఉత్సాహం చూపగా... సెక్యూరిటీ పాయింట్ వద్ద నుంచి వారికి చేతులు ఊపుతూ, అభివాదం చేశారని చెప్పారు. జైలు నిబంధనలను ఉల్లంఘించవద్దని, డీఐజీని ఇబ్బంది పెట్టవద్దని వారికి సూచించారని తెలిపారు. 

More Telugu News