Telangana: కన్న బిడ్డల కాళ్లు, చేతులు విరిచేసి, వాతలు పెట్టి.. నోట్లో గుడ్డలు కుక్కి.. ఓ తల్లి కర్కశత్వం

  • సిద్దిపేట జిల్లాలో ఘటన
  • వివాహేతర సంబంధంతో పిల్లలను వదిలించుకునే యత్నం
  • ప్రియుడితో కలిసి పిల్లలకు నిత్యం నరకం చూపించిన తల్లి

నరకం అంటే ఎక్కడో లేదని నిరూపించిందో తల్లి. మరో వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్న ఆమె కన్నబిడ్డలను రాచి రంపాన పెట్టింది. శరీరంపై వాతలు పెట్టింది. అరుపులు బయటకు వినపడకుండా నోట్లో గుడ్డలు కుక్కింది. కాళ్లు, చేతులు విరిచేసేంది. ఇష్టం వచ్చినట్టు కొట్టింది. ఇంతా చేస్తే.. ఆ చిన్నారుల వయసు నిండా నాలుగేళ్లలోపు కూడా లేకపోవడం ఆమె కర్కశత్వాన్ని బయటపెడుతోంది. మాతృత్వానికి మాయనిమచ్చగా నిలిచే ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది.

పోలీసుల కథనం ప్రకారం.. వర్గల్ మండలం తున్కిఖాల్సకు చెందిన రేణుకకు ఇద్దరు పిల్లలు దివ్య (4), డేవిడ్ (రెండేళ్లు) పుట్టిన తర్వాత భర్త ఆమెను వదిలేశాడు. గజ్వేల్‌లో కూలి పనులు చేసుకునే రేణుకకు గజ్వేల్ సమీపంలోని జాలిగామకు చెందిన మాచపురం సురేశ్ అలియాస్ సురేందర్‌తో స్నేహం కుదిరింది. అతడికి పెళ్లయినా భార్యను వదిలేయడంతో వీరి స్నేహం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈక్రమంలో గత 20 రోజులుగా సురేశ్ మండలంలోని నాచారంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని రేణుక, పిల్లలతో కలిసి ఉంటున్నాడు.

వారి సంబంధానికి అడ్డు వస్తున్న పిల్లలను వదిలించుకోవాలనే ఉద్దేశంతో రోజూ పిల్లల నోట్లో గుడ్డలు కుక్కి చావబాదడం, వాతలు పెట్టడం, కాళ్లు చేతులు మెలితిప్పడం చేసేవారు. నోట్లో గుడ్డలు ఉండడంతో వారి అరుపులు బయటకు వినిపించేవి కావు.

ఆదివారం మరోమారు వారు ఇవే అకృత్యాలకు పాల్పడగా బాధకు తట్టుకోలేని దివ్య గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చారు. కాళ్లు వాచిపోయి నడవలేని స్థితిలో ఉన్న చిన్నారిని చూసి చలించిపోయారు. ముఖం కమిలిపోయి రక్తం కారుతుండడంతో వెంటనే చేరదీసి గాయలు శుభ్రం చేసి అన్నం పెట్టారు. అనంతరం 108 అంబులెన్స్‌లో గజ్వేల్ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారులను చిల్డ్రన్ హోంకు తరలించనున్నట్టు తెలిపారు.

More Telugu News