Salman Khan: వెళ్లండి.. ఇంటికెళ్లి నిద్రపోండి.. అభిమానులతో సల్మాన్

  • సల్మాన్‌కు బెయిలు రావడంతో అభిమానుల సంబరాలు
  • జోధ్‌పూర్ జైలుకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు
  • ముంబైలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన నటుడు

కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల శిక్షకు గురై జోధ్‌పూర్ కేంద్ర కారాగారంలో రెండు రోజులు గడిపిన బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు శనివారం కోర్టు బెయిలు మంజూరు చేసింది. సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో జైలు నుంచి విడుదలైన సల్మాన్ ముంబైలోని తన ఇంటికి చేరుకున్నాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చి బయట పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్న అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. ఇంటికి వెళ్లి నిద్రపోవాల్సిందిగా వారిని కోరాడు. తండ్రి సలీం ఖాన్, మేనల్లుడు అహిల్,  శర్మ, సోదరిలు, బాడీగార్డులతో కలిసి బాల్కనీలోకి వచ్చిన సల్మాన్ అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేశాడు. చిరునవ్వుతో ప్లైయింగ్ కిస్‌లు విసిరాడు. అనంతరం మాట్లాడుతూ.. తన కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు.
20 ఏళ్లపాటు కొనసాగిన కృష్ణ జింకల వేట కేసులో గురువారం జోధ్‌పూర్ సల్మాన్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. రెండు రోజులపాటు జైలులో గడిపిన సల్మాన్‌కు శనివారం కోర్టు  రూ.50 వేల పూచీకత్తుపై  బెయిలు మంజూరు చేసింది.

సల్మాన్ విడుదల కానున్న విషయం తెలిసి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. కొందరు అభిమానులు పూల దండలు తీసుకొచ్చారు. ‘సల్మాన్ జిందాబాద్’, ‘సల్మాన్ మేమంతా నీ వెంటే’ అంటూ నినాదాలు చేశారు. కొందరు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

More Telugu News