Prakash Raj: గోవు హిందూ మతం ఎప్పుడు పుచ్చుకుంది?: ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు

  • నేను పర్యటించిన చోట గోమూత్రంతో శుద్ధి చేస్తున్నారు
  • అణగారిన వర్గాల కోసం బీజేపీని ప్రశ్నిస్తూనే ఉంటా
  • మనిషి కంటే గోవే ముఖ్యమా?
  • నిలదీసిన ప్రకాశ్ రాజ్

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను వెళ్లిన ప్రతి చోట కొందరు మతఛాందసవాదులు ఆవు పేడతో కళ్లాపి చల్లి, గోమూత్రంతో శుద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. గోవు, కొబ్బరికాయ ఎప్పుడు హిందూ మతం పుచ్చుకున్నాయని ప్రశ్నించారు. ఖర్జూరం, గొర్రె ముస్లిం మతంలో ఎప్పుడు చేరాయని నిలదీశారు. పసుపు, కాషాయ వర్ణాలది ఏ జాతి అని ప్రశ్నించారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కానని, అణగారిన వర్గాలకు ఎప్పడూ అండగా ఉంటానని తేల్చి చెప్పారు. బీజేపీపై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

మనిషి కన్నా గోవే ముఖ్యమని కొందరు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేసిన ప్రకాశ్ రాజ్ ప్రశ్నించే తత్వాన్ని మర్చిపోతున్నారంటూ విలేకరులకు చురకలంటించారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కొందరు ఆ తర్వాత రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారని, దళితులను శునకాలతో పోలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార పద్ధతుల గురించి ప్రశ్నించే నాయకులకు మనుషులు కనిపించడం లేదా? అని కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డేను ఉద్దేశించి పేర్కొన్నారు.

గోహత్య చేసిన వారు తల్లి తలను నరికిన వారితో సమానమని కన్నడ నటుడు చిరంజీవి సర్జా నటించిన సీజర్‌ చిత్రంలో ఆక్షేపణీయమైన మాటలు రాశారన్నారు. తప్పుడు మాటలు, తప్పుడు సందేశాలు ఇచ్చే బీజేపీ నేతలను ప్రశ్నించేందుకు 2500 మందితో ఓ బృందాన్ని తయారు చేసినట్టు ప్రకాశ్ రాజ్ తెలిపారు.

More Telugu News