Salman Khan: సల్మాన్ ఖాన్ కోసం అప్పుడే జైలు గదిని కూడా శుభ్రం చేశారు!

  • కృష్ణ జింకలను వేటాడిన కేసులో కాసేపట్లో తీర్పు
  • దోషిగా తేలితే ఏడాది నుంచి ఆరేళ్ల వరకు శిక్ష
  • జోధ్ పూర్ సెంట్రల్ జైల్లో సల్మాన్ కోసం గది సిద్ధం

కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ భవితవ్యం నేడు తేలిపోనుంది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ కోర్టు కాసేపట్లో తీర్పును వెలువరించనుంది. 11 గంటలకు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ కేసులో సల్మాన్ దోషిగా తేలితే... ఒక ఏడాది నుంచి ఆరేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జోధ్ పూర్ జైలు అధికారులు సల్మాన్ కోసం అప్పుడే ఓ గదిని శుభ్రం చేసి, రెడీగా ఉంచారు.

 ఈ సందర్భంగా జోధ్ పూర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ, సెంట్రల్ జైల్లో సల్మాన్ కోసం ఓ గదిని శుభ్రం చేసి ఉంచామని చెప్పారు. కానీ, గదిలో ఏసీ, కూలర్, ఫ్యాన్ లాంటి ప్రత్యేక సదుపాయాలేమీ లేవని తెలిపారు. రాజస్థాన్ కు చెందిన లారెన్స్ బిష్కోయ్ అనే గ్యాంగ్ స్టర్ సల్మాన్ ను చంపుతానని కొంతకాలంగా బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో, సల్మాన్ కు ప్రత్యేక భద్రతను కల్పిస్తామని చెప్పారు. మరోవైపు జోధ్ పూర్ కోర్టు ప్రాంగణంలో 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

More Telugu News