Hyderabad: కేసీఆర్ సర్కారు సంచలన నిర్ణయం... జంటనగరాల్లోకి ప్రైవేటు బస్సులకు నో ఎంట్రీ!

  • ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు మొదలు
  • ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
  • బస్సుల గుర్తింపును రద్దు చేస్తామన్న ఆర్టీయే అధికారులు

హైదరాబాద్ లో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరం లోపలికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు ఎంట్రీని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీయే అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని సూచించాయి. నిబంధనలను అతిక్రమించి, నగరంలోకి ప్రవేశిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని, బస్సులను సీజ్ చేసి, గుర్తింపును రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

 కాగా, ప్రస్తుతం ఉదయం 8 గంటలలోపు, రాత్రి 9 గంటల తరువాత నగరంలోకి ప్రైవేటు బస్సులను అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు ఉదయం 8 గంటలలోపు గమ్యస్థానాలకు చేరిపోతుండగా, రాత్రి 9 గంటల తరువాత శివార్లలోని బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరుతున్నాయి. సర్కారు తాజా నిర్ణయంతో విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులు ఎల్బీ నగర్, కర్నూలు వైపు నుంచి వచ్చే బస్సులు అత్తాపూర్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావాల్సి వుంటుంది. ఈ నిర్ణయంపై ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల స్పందన వెలువడాల్సివుంది.

More Telugu News